పదో తరగతి పరీక్షలకు రోజులు దగ్గరపడుతున్న నేపథ్యంలో సర్కారు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. కొవిడ్ కారణంగా రెండేండ్లు పరీక్షలు లేకుండానే ఫలితాలు ప్రకటించిన విషయం తెలిసిందే. మూడేండ్ల విరామం తర్వాత పదో తరగతి పరీక్షలకు విద్యా శాఖ సన్నాహాలు చేస్తున్నది. వందశాతం ఉత్తీర్ణత సాధించేలా అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రతిరోజూ ఉదయం,సాయంత్రం స్లిప్ టెస్టులు, వారాంతపు పరీక్షలు, ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ వహిస్తున్నారు.
నాగర్కర్నూల్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూడేండ్ల తర్వాత మళ్లీ పరీక్షలను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏ ర్పాట్లు చేస్తున్నది. కరోనా మహమ్మారి సాధారణ జన జీవితంతోపాటు విద్యార్థుల భవితవ్యాన్ని ప్రభావితం చేసిం ది. దాదాపు రెండేండ్లపాటు తరగతులు నిర్వహించని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఫలితంగా విద్యార్థులు తరగతులకు హాజరుకాకుండా, ఉపాధ్యాయుల బోధనలు జ రగకుండా, పరీక్షలు జరగకుండా పైతరగతులకు చేరుకొన్నారు. దీనివల్ల విద్యార్థుల బోధన సామర్థ్యాలు కూడా పడిపోయాయి. ఈ కారణంగా 2019-20, 2020-21 సంవత్సరాల్లో విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. ఫలితంగా ఇంటర్కు పరీక్షలు లేకుండానే ప్రమోట్ అయ్యారు. ఇలా రెండేండ్లు పది పరీక్షలు జరగకపోవడంతో ఇంటర్లో చే రిన విద్యార్థుల్లో ఆశించిన సామర్థ్యం కనిపించడం లేదు. ఎట్టకేలకు కరోనా తగ్గడంతో ఈ విద్యా సంవత్సరం పది పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. విద్యా శాఖ మేలో పరీక్షల నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది.
ఈ విద్యా సంవత్సరంలో జరిగే ప్రశ్నాపత్రం కూడా మారనున్నది. ఇంతకు ముందు 11 పేపర్లకు పరీక్షలు జరిగితే ఈసారి 6 పేపర్లకే పరీక్షలు జరగనున్నాయి. కాగా ఇం తకు ముందు నాలుగైదు చాప్టర్లు, కొన్ని ముఖ్యమైన ప్రశ్న లు చదివితే పరీక్షల్లో గట్టెక్కే పరిస్థితులు ఉండేవి. కానీ ప్ర శ్నాపత్రం విధానం మారనున్నది. ఇంతకుముందు వచ్చిన ప్రశ్నలు ఈ సంవత్సరం పరీక్షల్లో పునరావృతం కావు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థి అన్ని చాప్టర్లు చదవాల్సిందే. అలా అయితేనే పరీక్షల్లో ప్రతిభ కనబరిచే అవకాశముంది. కాగా, జనవరి 10లోపే పూర్తి కావాల్సిన సిలబస్ సంక్రాం తి సెలవులు, కరోనా థర్డ్వేవ్తో ఇంకా జరుగుతున్నది.
ప్రైవేట్ పాఠశాలల్లో ఈ అంశంలో ముందున్నా ప్ర భుత్వ పాఠశాలల్లో వందశాతం సిలబస్ పూర్తి చేసేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులను కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే చదువులో వెనకబడి ఉన్న విద్యార్థులపై మ రింత శ్రద్ధ చూపించనున్నారు. వంద శాతం ఉత్తీర్ణత సా ధించాలంటే ఈ విద్యార్థులే కీలకం కానున్నారు. దీనివల్ల పాఠశాలల హెచ్ఎంలు ప్రతిరోజూ పాఠ్యాంశాల పూర్తికి, విద్యార్థుల సన్నద్ధతపై సమీక్షిస్తున్నారు. ఉదయం గంట, సాయంత్రం గంట చొప్పున రోజూ రెండు గంటల ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
రోజువారీ, వారాంతపు పరీక్షలు సైతం నిర్వహిస్తూ విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నారు. మనఊరు-మనబడి పథకంలో భాగంగా వచ్చే సంవత్సరం ఆంగ్ల మాధ్యమంలో బోధన కొనసాగనుంది. ఈ కారణం గా ఈసారే తెలుగులో పరీక్షలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. నాగర్కర్నూల్ జిల్లాలో పది పరీక్షలకు 245 ప్ర భుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు గురుకులాలు, ఎయిడెడ్, కస్తూ ర్బా, మోడల్ స్కూళ్లలోని బా లురు 5,963, బాలికలు 5,824 మందితో కలిపి 11,787 మంది వి ద్యార్థులు హా జరు కానున్నారు.
పది పరీక్షలకు ఏర్పాట్లు
పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే వందశాతం సిలబస్ పూర్తి చేస్తాం. ప్రతిరోజూ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు, వీక్లీ పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. మేలో జరిగే పరీక్షల నాటికి విద్యార్థులను స న్నద్ధం చేస్తాం. వెనకబడిన విద్యార్థులు, వెనకబడిన పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి కేటాయిస్తున్నాం.
– కుర్మయ్య, జీహెచ్ఎం, జెడ్పీహైస్కూల్, నాగర్కర్నూల్