ఊహించని విధంగా బహిరంగ వేలానికి స్పందన వచ్చింది. అప్పటివరకు ప్లాట్లు అమ్ముడుపోతే చాలు అనుకున్న అధికారులు ఒక్కసారిగా వేలం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. కనీస ధరకు మూడింతలకు పైగా ధరల పలికింది. మహబూబ్నగర్- భూత్పూర్ రోడ్డులో ఉన్న రాజీవ్ స్వగృహ సారికా టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్ల బహిరంగ వేలం సోమవారం విజయవంతంగా సాగింది. అప్పన్నపల్లి వద్ద ఉన్న వైట్ హౌస్ కన్వెన్షన్ హాల్లో తొలి రోజు 60ఓపెన్ ప్లాట్ల కోసం వేలం జరగ్గా కనీస ధర గజానికి రూ.8వేల నుంచి ప్రారంభమైంది. అత్యధికంగా గజానికి రూ.26,500వరకు పలుకడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.
మహబూబ్నగర్, మార్చి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గతంలో ఎవరూ కొనుగోలు చేయని ప్లాట్లకు ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ వేలంలో కనీస ధరకు మూడింతలకు పైగా పలికింది. మహబూబ్నగర్-భూత్పూర్ రోడ్డులోని రాజీవ్ స్వగృహ సారిక టౌన్షిప్ ఓపెన్ ప్లాట్లకు వైట్ హౌస్ కన్వెన్షన్ హాల్లో సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. తొలి రోజు 60 ఓపెన్ ప్లాట్ల కోసం కనీస ధర రూ.8 వేల నుంచి వేలం ప్రారంభమైంది. మొదటి ప్లాట్ మాత్రం గజం రూ.15,500 పలికింది. ఆ తర్వాత నుంచి గజం రూ.26,500 వరకు వేలం పాడారు.
ఊహించని విధంగా ధరలు పెరగడంతో ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆశ్చర్యపోయారు. హైదరాబాద్ స్థాయిలో ధర వచ్చిందంటూ చెప్పారు. తొలి రోజు 250 నుంచి 410 గజాల వరకు ఉన్న 60 ప్లాట్లకు వేలం నిర్వహించగా.. రూ.37 కోట్ల ఆదాయం వచ్చింది. గజం సరాసరిగా రూ.20,050 పలికినట్లు అధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు (ఈ నెల 17 వరకు) వేలం ఉండనున్నది. మంచి ధరకు ప్లాట్లను కొనుగోలు చేయాలని ఆశావహులు, ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
అభివృద్ధికి మచ్చుతునక..
సారికా టౌన్ షిప్లో గతంలో ఏమాత్రం డిమాండ్ లేని ఓపెన్ ప్లాట్లు ఒక్కసారిగా ఈ స్థాయిలో డిమాండ్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఎనిమిదేండ్లలో మహబూబ్నగర్ పట్టణంలో ఊహించని విధంగా జరిగిన అభివృద్ధే ఇందుకకు కారణంగా స్థానికులు చర్చించుకుంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశాలమైన రోడ్లు, నిత్యం శుద్ధ జలం, పార్కులు, సీసీ రోడ్లు, ప్రభుత్వ మెడికల్ కళాశాల, హైదరాబాద్కు పెరిగిన రోడ్ కనెక్టివిటీ, బైపాస్ రోడ్డు, అన్నింటికీ మించి అభివృద్ధిలో దూసుకుపోవడంతో రియల్ ఎస్టేట్కు ఊహించని డిమాండ్ వచ్చింది. మహబూబ్నగర్ వచ్చి స్థిరపడే వారి సంఖ్య వందల నుంచి వేలకు చేరుకున్నది. అందుకే రాజీవ్ స్వగృహ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ తదితర నగరాల నుంచి కూడా కొనుగోలుదారులు తరలివచ్చారు. ప్రభుత్వమే చేసిన లే అవుట్ అయినందున ఎలాంటి చీకూ చింత ఉండదని కొనుగోలుదారులు భావించారు.
మారిన రూపురేఖలు..
మహబూబ్నగర్లో 2014కు ముందు రూ.2వేలకు గజం దొరికేది. కానీ ఇప్పుడు సారిక టౌన్షిప్లో ప్రభుత్వం గజానికి రూ.8వేలు నిర్ణయిస్తే.. వేలంలో రూ.26,500 వరకు కొనుగోలు చేశారంటే ఇక్కడి అభివృద్ధిని ఊహించొచ్చు. గతంలో తాగునీటి వసతి లేక ఇక్కడ పనిచేసేందుకు ఉద్యోగులు ఆసక్తి చూపేవారు కాదు. కానీ, తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ రూపురేఖలు మార్చేశాం. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా తీర్చిదిద్దాం. ఫలితంగా మహబూబ్నగర్లో పేదలు, ధనవంతులు తేడా లేకుండా అందరి స్థలాలు, ఇండ్లకు డిమాండ్ వచ్చింది. జిల్లాల ఏర్పాటయ్యాక డిమాండ్ తగ్గుతుందని చాలా మంది అన్నారు. కానీ, అందుకు వ్యతిరేకంగా మరింత డిమాండ్ పెరిగింది. భవిష్యత్తులో ఎవరూ ఊహించని స్థాయికి మహబూబ్నగర్ మహానగరంగా మారుతుంది.
– వి.శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి
అభివృద్ధికి ఇదో ఉదాహరణ..
మహబూబ్నగర్ సాధించిన అభివృద్ధికి సారిక టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్ల విక్రయాల ధరలు ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రభుత్వం నిర్ణయించిన ధర గజానికి రూ.8వేలు కాగా.. సోమవారం వేలంలో రూ.26,500కు గజం విక్రయమైంది. కొనుగోలుదారులు మహబూబ్నగర్లో ప్లాట్ల కోసం ఏ విధంగా ముందుకు వస్తున్నారో ఈ ధరలే చెబుతున్నాయి. హైదరాబాద్ స్థాయిలో స్థలాల ధరలు చేరుకున్నాయంటే.. మహబూబ్నగర్ సాధించిన అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు.
– వెంకట్రావు, మహబూబ్నగర్ కలెక్టర్