న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి తొలిసారిగా ఓ మహిళ సారథ్యం వహించబోతున్నారు. సెబీ మాజీ సభ్యురాలైన మాధవి పూరి బచ్ను సెబీ చైర్పర్సన్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సెబీ చైర్మన్గా వ్యవహరిస్తున్న అజయ్ త్యాగీ తన ఐదేండ్ల పదవీకాలం ముగియడంతో ఆ స్థానంలో పూరి నియమితురాలైయ్యారు. మంగళవారం ఆమె తన పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ నియామకానికి అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా. ఆమె ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నారు. అలాగే ప్రైవేట్ రంగం నుంచి వచ్చిన తొలి వ్యక్తి కూడా ఆమె కావడం గమనార్హం. ఏప్రిల్ 5, 2017 నుంచి అక్టోబర్ 4, 2021 వరకు అజయ్ త్యాగీ సారథ్యంలోని సెబీ బోర్డు సభ్యురాలుగా విధులు నిర్వహించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం), అహ్మదాబాద్లో డిగ్రీ పట్టాపొందిన ఆమెకు ఆర్థిక మార్కెటింగ్ రంగంలో 30 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది. 1989లో ఐసీఐసీఐ బ్యాంక్లో తన కేరియర్ను ప్రారంభించారు.