రాజాపేట, డిసెంబర్ 5 : రైతన్న ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. రేణికుంట పీఏసీఎస్ ఆధ్వర్యంలో మండలంలోని రఘునాథపురం, సోమారం, బొందుగుల, కుర్రారం, సింగారం, పాముకుంట, రాజాపేట, రేణికుంట, బేగంపేట, చల్లూరు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 415 మంది రైతుల నుంచి 78 వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేశారు. ఓటీపీ వచ్చిన 180 మంది రైతుల ఖాతాల్లో రూ.1.68 కోట్లు జమ చేశారు. రానున్న 15రోజుల్లో మరో లక్ష బస్తాలకు పైగా కొనుగోలు చేయనున్నారు.
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తాం. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి. కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు కూడా వెంటనే చేస్తున్నాం. ఇప్పటికే 50 శాతం ధాన్యం కొనుగోలు చేశాం. మిగతా ధాన్యం కొనుగోళ్లు సైతం త్వరలోనే పూర్తి చేస్తాం.
-సిల్వేరు శేఖర్, సీసీ బ్యాంక్ సీఈఓ, రాజాపేట
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు హర్షణీయం
ధాన్యం విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయం. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించి మద్దతు ధర పొందాను. అందుబాటులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు. -కనకయ్య, రైతు, పాముకుంట