తెలంగాణ అన్నదాతలు ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. మూస పద్ధతులకు స్వస్తి పలికి యంత్రాలను వినియోగిస్తూ పంటలను సాగు చేస్తున్నారు. మార్కెట్ ఆధారిత పంటలను సాగు చేస్తూ రైతన్న ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఈ క్రమంలో సాంప్రదాయ వరి సాగుకు విరామం ఇచ్చి లాభసాటి పంటలపై దృష్టిసారిస్తున్నారు. వరి పంట సాగులో వచ్చే ఇబ్బందులు, ఖర్చులను బేరీజు చేసుకొని తక్కువ నీటితో ఎక్కువ లాభం వచ్చే పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, చేను దగ్గరకే వ్యాపారులు వచ్చి గిట్టుబాటు ధర చెల్లించి తీసుకొని వెళ్లే విధంగా పంటలను సాగు చేస్తున్నారు. ఇటీవల బొప్పాయి పండ్లకు భారీ గిరాకీ ఉన్నది. డిమాండ్కు అనుగుణంగా దుబ్బాక మండల రైతులు సాగుకు సిద్ధం చేస్తున్నారు. మండల పరిధిలోని అప్పనపల్లికి చెందిన రైతు చెర్లపల్లి రాజిరెడ్డి బొప్పాయి పంట వేసి, ఆదర్శంగా నిలుస్తున్నాడు. గతంలో వరి సాగుచేసిన 3 ఎకరాల పొలంలోనే బొప్పాయి పంటను సాగు చేస్తున్నాడు. దుబ్బాక మండలంలోనే ఇంత విస్తీర్ణంలో బొప్పాయి పంట సాగును మొదలుపెట్టిన మొదటి రైతు రాజిరెడ్డి. ఎరువులు, క్రిమిసంహారక మందులను వినియోగించకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో బొప్పాయిని సాగు చేస్తున్నట్లు రైతు రాజిరెడ్డి తెలిపారు.
సేంద్రియ ఎరువులతో సాగు..
సేంద్రియంగా పండించిన ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలకు డిమాండ్ ఉండడంతో బొప్పాయి పంటను సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నాడు. పశువుల పేడ, జీవామృతంతో పం టలపై పిచికారీ, దశవర్మీకంపోస్టు, ఆకుల రసాయనంతోపాటు పుల్లటి పెరుగును బొప్పాయి మొక్కలకు ఎరువుగా అందిస్తున్నాడు.
బిందుసేద్యంతో ….
మూడు ఎకరాల పొలంలో బొప్పాయి సాగును పూర్తిగా డ్రిప్ పద్ధతిలో బిందు సేద్యం చేస్తుండగా, ఎకరా వరి పంట నీటితో 3 ఎకరాల్లో బొప్పాయిని సాగుచేయవచ్చు. కూలీల తిప్పలు లేకుండా పం టను సాగు చేస్తున్నారు. పంట మొ దట్లో మొక్కల ఎదుగుదలకు ప్లాస్టిక్ కవర్ల సహాయంతో (మల్చింగ్) తేమగా ఉండి కలుపు మొక్కల భారీ నుంచి రక్షణ పొందేవిధంగా సాగు చేస్తు న్నాడు రైతు రాజిరెడ్డి. ప్రస్తుతం బొప్పాయి పంట 75 రోజులదని, 7 నెలల్లో మొదటి కాత వస్తున్నది. తెగుళ్లు రాకుండా జాగ్రత్త పడితే 3 ఏండ్లపాటు బొప్పాయి పండుతుంది. ఎకరాకు కనిష్టంగా 30 టన్నుల నుంచి గరిష్టంగా 60 టన్నుల వరకు దిగుబడి వస్తుందని, టన్నుకు ప్రస్తుతం మార్కెట్లో రూ.2 లక్షల 40 వేల ధర ఉందని రైతు రాజిరెడ్డి వెల్లడించాడు.
దుబ్బాక నియోజకవర్గంలో బొప్పాయి సాగు …
దుబ్బాక మండలంలో 3 ఎకరాలు, మిరుదొడ్డి మండలంలో 12 ఎకరాలు, తొగుట మండలంలో 8 ఎకరాలు, రాయపోల్ మండలంలో 18 ఎకరాలు, దౌల్తాబాద్ మండలంలో 9 ఎకరాల విస్తీర్ణంలో రైతులు బొప్పాయి తోటను సాగు చేస్తున్నారు.
వరి తిప్పలు తప్పించుకునేందుకే
వరి పంటలో వస్తున్న ఇబ్బందులను భరించలేకనే బొప్పాయి పంట సాగు వైపు దృష్టి సారించా. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు రావడమే కాకుండా కూలీలు, నీటి ఇబ్బందులు ఉండవు. రైతులు వరికి బదులుగా లాభసాటి పంటపై దృష్టి పెట్టాలి. లాభాలు తెచ్చే ఆరుతడి పంటలను సాగు చేయాలి.
ఆరుతడి పంటలతో అధిక లాభాలు
రైతులు మూస పద్ధతి వీడనాడి ఆరుతడి పంటల వైపు మళ్లాలి. బొప్పాయితో పాటు పండ్ల తోటలు, కూరగాయల పంటలు సాగు చేసి, అధిక లాభాలు పొందాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామాల్లో ఆరుతడి పంటలపై విస్తారంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. దీంతో రైతుల్లోనూ మార్పు వస్తున్నది. తక్కువ నీటితో, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వచ్చే పంటల సాగు వైపు రైతులు చూస్తున్నారు.