సిరిసిల్ల టౌన్ : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీశాల లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. భక్తుల జయజయధ్వానాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని రథోత్సవం కనుల పండువలా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి రథోత్సవాన్ని వీక్షించారు. ఈ నెల 12 నుంచి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు ఉభయదేవేరులతో కలిసి రథోత్సవంపై పురవీధుల్లో విహరించారు.
అంతకు ముందు ఉదయం 5 గంటలకు ఆలయంలో హోమం, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రథంపై కొలువుదీరిన స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం సమయంలో రథోత్సవం నిర్వహించగా.. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జాతర నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.