‘స్వతహాగా నాకు కామెడీ, థ్రిల్లర్ చిత్రాలు చాలా ఇష్టం. ఏ కథ రాసుకున్నా ఆ అంశాలు తప్పకుండా ఉండేలా చూసుకుంటా’ అన్నారు స్వరూప్ ఆర్.ఎస్.జె. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మాతలు. ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ సంగతులివి..
2014లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. దావూద్ ఇబ్రహీం అనే వ్యక్తిని పట్టుకుంటే నగదు బహుమతి అందజేస్తామని పేపర్లలో వచ్చిన ఓ ప్రకటన చూసి పాట్నాకు చెందిన ముగ్గురు పిల్లలు ముంబయి వెళతారు. ఈ వార్తను ఆధారం చేసుకొని స్క్రిప్ట్ సిద్ధం చేశా. ఈ సినిమాలో అరవైశాతం కామెడీ ఉంటుంది. మిగతాదంతా థ్రిల్లర్ అంశాలతో సాగుతుంది. ఇందులో తాప్సీ ప్రైవేట్ పరిశోధనాత్మక జర్నలిస్ట్గా కనిపిస్తుంది. ముగ్గురు పిల్లల పాత్రల్లో రోషన్, భానుప్రకాష్, జైతీర్థ నటించారు. పాత్ర చిన్నదైనా కథ నచ్చి తాప్సీ ఈ సినిమాకు ఒప్పుకొంది.
పిల్లల నేపథ్య కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందని నిర్మాతలు మెచ్చుకున్నారు. నేటితరం పిల్లలు వయసుకు మించిన పరిణతితో కనిపిస్తున్నారు. టీవీ, ఇంటర్నెట్..ఇతర కారణాల వల్ల వారిలో ఉండే సహజమైన అమాయకత్వం మిస్ అవుతున్నది. ఈ సినిమాలో పిల్లల వయసుకు తగినట్లుగా వారి పాత్రల్ని తీర్చిదిద్దాం. వారికోసం అరవైరోజుల పాటు వర్క్షాప్ నిర్వహించాం. హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న ఎనిమిది గ్రామాల్లో చిత్రీకరణ జరిపాం. ఇటీవల విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన లభిస్తున్నది.నాణ్యతాపరంగా ఎక్కడా లోపం లేకుండా పరిమిత బడ్జెట్లో ఈ సినిమా తీశాం. డిటెక్టివ్ థ్రిల్లర్గా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మాత్రమే విడుదల చేస్తున్నాం. మిగతా భాషల్లో రిలీజ్ చేస్తే తెలుగు నేటివిటీ తాలూకు సహజత్వం మిస్ అవుతుందనిపించింది.