అలారం మోగకుండా..కెమెరా పసిగట్టకుండా..
కేబుళ్లు కట్ చేసిన దొంగలు
గ్యాస్కట్టర్తో లాకర్ ఓపెన్
రూ.18.46 లక్షల నగదు, రూ.2.90 కోట్ల నగలు చోరీ
పెద్దపల్లి, మార్చి 25 (నమస్తే తెలంగాణ)/ మంథని రూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్బీఐ శాఖలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు బ్యాంకు కిటీకీని బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. గురువారం బ్యాంకును తెరిచిన సిబ్బంది దొంగతనం జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ నేతృత్వంలో పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. ఈ ఘటనలో బ్యాంకులో భద్రపరిచిన రూ.18.46 లక్షల నగదుతోపాటు రూ.2.90 కోట్ల విలువ చేసే ఆరు కిలోల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. బ్యాంకు వెనుక వైపున్న కిటికీలోంచి లోపలికి ప్రవేశించిన దొంగలు.. అలారం మోగకుండా కేబుల్ను కట్ చేయడంతోపాటు బ్యాటరీలను తొలగించారు. సీసీ కెమెరాల కనెక్షన్ కట్ చేసి డీవీఆర్ను తీసుకువెళ్లారు. స్ట్రాంగ్ రూంలోని లాకర్ను గ్యాస్ కట్టర్తో కట్ చేసి అందులో ఉన్న రూ.18.46 లక్షల నగదు, రూ.2.90 కోట్ల విలువైన ఆరు కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బ్యాంకులో క్లూస్టీం, డాగ్ స్కాడ్తో ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకొనేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు సీపీ సత్యనారాయణ తెలిపారు.