సిటీబ్యూరో,డిసెంబర్ 18 (నమస్తేతెలంగాణ) : పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ బుక్ఫెయిర్ (పుస్తక ప్రదర్శన) శనివారం ప్రారంభమైంది. దోమలగూడ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ కళాభారతి (చిందు ఎల్లమ్మ) వేదికగా ఏర్పాటు చేసిన 34వ బుక్ఫెయిర్ను క్రీడలు,సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మనిషి ఉన్నతికి పుస్తకాలే దోహదమని, విజ్ఞానంతోనే అత్యున్నత శిఖరాలకు చేరుకుంటామన్నారు. జ్ఞాన సముపార్జనలో పుస్తకమే దిట్టని, కవులు, రచయితలు, పుస్తకాల వల్లే తెలంగాణ చరిత్ర మనగలిగిందని, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ను నడిపించింది కూడా పుస్తకాలేనని గుర్తుచేశారు. తాళపత్ర గ్రంథాలు మొదలుకొని డిజిటల్ యుగంలో కూడా మనిషికి మార్గదర్శిగా పుస్తకమే నిలుస్తుందని, పుస్తక ప్రదర్శనకు ఒక్కరొక్కరు కాదు..కుటుంబ సమేతంగా విచ్చేసి ఆదరించాలని కోరారు. పుస్తక ప్రియుల కోసం రవీంద్రభారతిలో నిరంతరం అందుబాటులో ఉండేలా పుస్తక ప్రదర్శన ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్, కార్యదర్శి కోయ చంద్రమోహన్ ప్రారంభోపాన్యాసం చేశారు. బోనాలు, కోలాటాలు, కోయల నృత్యాలు ఆద్యంతం అలరించాయి. అనంతరం మంత్రి తెలంగాణ భాషా సాంస్కృతిక స్టాల్, తెలంగాణ సాహిత్య అకాడమీ, బీసీ స్టడీ సర్కిల్ స్టాళ్లను ప్రారంభించి పుస్తకాలను పరిశీలించారు తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన పుస్తకాన్ని బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ గతేడాది కొవిడ్ కారణంగా పుస్తక పండుగ నిర్వహించు కోలేకపోయామని, ఈనెల 28 వరకు పుస్తక ప్రదర్శన జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ బాలాచారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత పద్మాచారి, రాజేశ్వర్రావు, శోభన్బాబు, రాజేశ్వర్, పలువురు సాహిత్య ప్రియులు
హాజరయ్యారు.
గతేడాది బుక్ఫెయిర్ మిస్సయ్యాం..
మనిషి విజ్ఞానాన్ని పెంచడంలో ప్రముఖ పాత్ర పుస్తకాలదే. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను గతేడాది మిస్సయ్యాం. ఈ ఏడాది ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. మా కళాశాల విద్యార్థులను బుక్ఫెయిర్కు తీసుకొస్తాం. సాహిత్యంలోని గొప్ప విషయాలు తెలుసుకునేందుకు తోడ్పడుతుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఈ పండుగను సందర్శించాలి. – మహేశ్ కాసుల, అధ్యాపకుడు
అన్నివర్గాల వారికి పుస్తకాలు
30 ఏండ్ల నుంచి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేందుకు విజేత కాంపిటీషన్ను తీసుకొస్తున్నాం. ఉన్నతవిద్యతోపాటు పోటీ పరీక్షలకు, సాహిత్య ప్రియులకు ఈ ప్రదర్శన స్వర్గం. అన్ని వర్గాలకు సంబంధించిన పుస్తకాలు అమ్ముతున్నాం. పుస్తక ప్రదర్శనకు ప్రభుత్వం వసతులు కల్పించడం సంతోషంగా ఉంది. – నాగయ్యచారి, స్టాల్ నిర్వాహకుడు
గంగా జమునా తెహజీబ్..
హైదరాబాద్ బుక్ఫెయిర్ గంగా జమునా తెహజీబ్గా సంస్కృతికి ఆలవాలంగా నిలుస్తుంది. పోతబోసిన అక్షరాలను ఆదరించిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది. రాష్ట్రం ఏర్పాటు తర్వాతే కవులు, రచయితలు, కళాకారులకు తగిన గుర్తింపు లభించింది. కోడికూత కంటే ముందే సామాజిక మాధ్యమాల్లో పనికిమాలిన అంశాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే మేలు. పుస్తకాలు పఠించే సమాజం జ్ఞానంవైపు నడవడంలో ముందుంటుంది. మానవ నాగరికత, సంస్కృతి వర్ధిల్లాలంటే సాహిత్యం చాలా అవసరం.
కాళోజీ మాటలు గుర్తుకు తెచ్చుకోవాలి
‘ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అని కాళోజీ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటే పుస్తకం విలువేంటో తెలుస్తుంది. ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే ఒకేఒక్క సాధనం పుస్తకం. ‘ప్రపంచం నన్ను దూరం పెడితే..పుస్తకం అమ్మలా ఆదరించి దరికి చేర్చింది’ అని అంబేద్కర్ పుస్తకం విలువను అప్పట్లోనే వివరించారు.
-బుర్రా వెంకటేశం,బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి
ఉద్యమానికి మార్గదర్శి
పుస్తకాలు, సాహితీ రచనలు తెలంగాణ ఉద్యమానికి మార్గనిర్దేశనం చేశాయి. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చరిత్ర రూపంలో తెలియజెప్పినవి పుస్తకాలే. పాటలు, సాహిత్యం తెలంగాణ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచాయి. జీవితంలో పుస్తకం ఒక భాగం కావాలి. అప్పుడే ఉత్తమ సమాజ నిర్మాణంలో ముందువరుసలో ఉంటాం.
తెలంగాణ మట్టి పరిమళాలు
పుస్తకాలు చరిత్రలో తెలంగాణ మట్టి పరిమళాలుగా నిలుస్తాయి. చందమామ, విస్డమ్ లాంటి పుస్తకాలను రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో కొనుగోలు చేసి చదివేవాళ్లం. సాహిత్యంపై అలా మమకారం పెరిగింది. ఈ ప్రదర్శనలో పాల్గొనడం సంతృప్తినిస్తున్నది.