హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శ్రీలంక నుంచి తమిళనాడు తీరం వరకు కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నది. ఆవర్తనం మూడు నాలుగు రోజుల్లో పశ్చిమ దిశగా ప్రయాణించే అవకాశం ఉన్నదని తెలిపింది. తూర్పు గాలుల్లోని ఉపరితల ద్రోణి.. అల్పపీడనం ప్రాంతం నుంచి ఉత్తర కోస్తాంధ్ర తీరం వరకు కొనసాగుతున్నదని పేర్కొన్నది. రాష్ట్రంలోని ఈశాన్య దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఈ వాతావరణ ప్రభావంతో శనివారం నుంచి నవంబర్ 2వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువొచ్చని తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలో అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా ఆర్లి(టి)లో 14.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని టీఎస్డీపీఎస్ వెల్లడించింది.