చిక్కడపల్లి, ఏప్రిల్ 8: తెలంగాణ గ్రంథాలయాలు అద్భుతంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు అన్నారు. శుక్రవారం ఆయన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, అశోక్నగర్లోని నగర గ్రంథాలయాలను సందర్శించారు. నగర గ్రంథాలయంలోని వసతులపై అక్కడ చదువుకొంటున్న విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల మంది విద్యార్థులు చదువుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రంథాలయాల్లో చేసిన ఏర్పాట్లు అద్భుతమని కొనియాడారు. ఏపీలో కూడా గ్రంథాలయాలను గ్రామస్థాయికి తీసుకెళ్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణ మహనీయుల రచనలు ఏపీ గ్రంథాలయాల్లో ఉన్నాయని, ఏపీ రచయితల పుస్తకాలు తెలంగాణ లైబ్రరీల్లో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ పౌర గ్రంథాలయం డిప్యూటీ డైరెక్టర్ హరిశంకర్, నగర గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ ప్రసన్న రామ్మూర్తి, కార్యదర్శి పద్మజ తదితరుల పాల్గొన్నారు.