సిరిసిల్ల రూరల్, జూన్ 5: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతున్నది. మండలంలోని గండిలచ్చపేట, కస్బెకట్కూర్, వేణుగోపాలపూర్ శివారు ప్రాంతాల్లో చిరుత పులి సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గండిలచ్చపేట శివారులోని జంగ లచ్చయ్యకు చెందిన పాడి గేదెను శనివారం రాత్రి పొలం వద్ద కట్టేయగా.. రాత్రి పూట చిరుత దాడి చేసి హతమార్చింది.
ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతు గేదె మృతి చెందడంతో ఆందోళనకు గురయ్యాడు. కాగా పది రోజుల క్రితం తంగళ్లపల్లి మండలం వేణుగోపాలపూర్ శివారులో రెండు పాడి గేదెలపై దాడిచేసి చంపిన విషయం తెలిసిందే. వేణుగోపాలపూర్, గండిలచ్చపేట శివారుల్లో చిరుతతోపాటు పులి పిల్ల కూడా తిరుగుతున్న ఆనవాళ్లు ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు.