హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్లో ఉస్మానియా మహిళల టెన్నిస్ టీమ్ జోరు కొనసాగిస్తున్నది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో ఉస్మానియా 3-0 తేడాతో జాదవ్పూర్ యూనివర్సిటీపై అద్భుత విజయం సాధించింది. తొలుత జరిగిన సింగిల్స్లో శ్రీవల్లి రష్మిక 6-0, 6-1తో మధురిమ మజుందార్పై అలవోకగా గెలిచింది. మరో సింగిల్స్లో సామ సాత్విక 6-0, 6-0తో మహిమ కుమార్ను చిత్తుగా ఓడించింది. డబుల్స్లో ఉస్మానియా జోడీ అవిష్కా గుప్తా, పావని పాఠక్ 6-2, 6-0తో జాదవ్పూర్ ద్వయం మహిమ కుమార్, మధురిమపై గెలిచి మ్యాచ్ను తమ వశం చేసుకుంది. ఇదిలా ఉంటే మహిళల మల్లకాంభ వ్యక్తిగత విభాగంలో ఓయూ విద్యార్థిని శ్వేత కులకర్ణి కాంస్యంతో మెరిసింది.