న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు చట్టం తేవడం సాధ్యం కాదని, ఎందుకంటే ఇది ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందని హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. సాగు చట్టాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సాగు చట్టాల రద్దుతో కేంద్రం మంచి సందేశం పంపిందని, అయితే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడం సాధ్యం కాదన్నారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ శుక్రవారం తీర్మానాన్ని ఆమోదించింది. అలాగే ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 700 మంది కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని తీర్మానంలో డిమాండ్ చేసింది.