కొలంబో : శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ కొత్త అవతారం ఎత్తనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే జట్టుకు స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్గా లసిత్ మలింగను ఆ దేశ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. స్పెషలిస్ట్ కోచ్ పాత్రలో మలింగ ఆస్ట్రేలియా పర్యటనలో వ్యూహాత్యక ప్రణాళికను అమలు చేయడంలో సహాయపడుతాడని, అలాగే సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తూ బౌలర్లకు మార్గనిర్దేశనం చేస్తాడని శ్రీలంక కికెట్ (SLC) ఒక ప్రకటనలో తెలిపింది. మలింగ అపారమైన అనుభవం, నైపుణ్యం.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బోర్డు భావిస్తున్నది. ఫిబ్రవరి 11 నుంచి ఆస్ట్రేలియాలో శ్రీలంక ఐదు టీ20 మ్యాచ్లు ఆడనున్నది.
మలింగను లంక బోర్డు సాంకేతిక సలహా కమిటీతో సంప్రదించి ఎగ్జిక్యూటివ్ కమిటీ నియమించగా.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 20 వరకు అమలులో ఉండనున్నది. ప్రపంచంలో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న మలింగ గతేడాది అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. లంక తరఫున మొత్తంగా 546 వికెట్లు పడగొట్టిన మలింగ.. 2011లోనే టెస్టులకు గుడ్బై చెప్పాడు. వన్డేలకు 2019లో వీడ్కోలు పలికాడు. 2021లో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 107 టీ20లు, 338 వన్డేలు, 101 టెస్టుల్లో 101 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో మలింగ పడగొట్టిన 170 వికెట్లు ఇప్పటికీ రికార్డే. ఈ సందర్భంగా స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్గా నియామకవడంపై మలింగ హర్షం వ్యక్తం చేశాడు. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే శ్రీలంక జట్టుకు తాత్కాలిక కోచ్గా రుమేశ్ రత్నాయకే నియామకమయ్యారు.