భద్రాద్రి కొత్తగూడెం : పారిశ్రామిక ప్రాంతమైన సారపాక శివారులోని పుష్కరవనం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జామాయిల్ లోడుతో ఐటీసీ పీఎస్ పీడీ వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండగా మిగిలిన వారందరినీ 108 వాహనంలో భద్రాచలం
తరలించారు.
దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సారపాక మండల పరిధిలోని కృష్ణసాగర్కు చెందిన గుర్రం సావిత్రి, తలవాది జయమ్మ, గడేషుల సామ్రమాజ్యం, కొట్టే శేషమ్మ, అవిటి జ్యోతి, మోతుకూరి లక్ష్మిలతో పాటు మరికొందరు ట్రాలీ ఆటోలో సారపాకలోని ఓ చర్చిలో ప్రార్థనకు వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో పుష్కరవనం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న జామాయిల్ లారీ ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుర్రం సావిత్రి తీవ్రంగా గాయపడగా.. అందులో డ్రైవర్ కొట్టె శ్రీనుతో పాటు తలవాది జయమ్మ, గడేషుల సామ్రాజ్యం, కొట్టె శేషమ్మ, అవిటి జ్యోతి, మోతుకూరి లక్ష్మిలతో పాటు మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అదనపు ఎస్ఐ ఖాజా నసీరుద్దీన్ అక్కడకు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బూర్గంపహాడ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.