వెల్దుర్తి, నవంబర్ 16: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హక్కీంపేట గ్రామాల శివారులో ఉన్న ఈటల రాజేందర్కు సంబంధించిన జమున హ్యాచరీస్ పరిశ్రమ భూకబ్జాపై మంగళవారం అధికారులు సర్వే ప్రారంభించారు. తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్ పర్యవేక్షణలో సర్వే డీఐ లక్ష్మీసుజాత ఆధ్వర్యంలోని ఆరుగురు సర్వేయర్ల బృందంతోపాటు మాసాయిపేట తాసిల్దార్ మాలతి, ఆర్ఐ ధన్సింగ్, వీఆర్వోల బృందం.. జమున హ్యాచరీస్ పరిశ్రమ వెనకభాగంలో ఉన్న అచ్చంపేట శివారులోని సర్వే నంబర్ 130లోని 18.35 ఎకరాల భూమిని సర్వే చేసింది.
ఈ సర్వే నంబర్కు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న రైతులు 20 మందితోపాటు పరిశ్రమ ప్రతినిధుల సమక్షంలో అధికారులు సర్వే చేశా రు. హద్దులను ఏర్పా టుచేయడంతోపాటు సబ్డివిజన్, రైతుల కబ్జా, వారికి ఉన్న పట్టా సర్టిఫికెట్ల ఆధారంగా ఈ సర్వే చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. సంబంధిత భూముల్లో కబ్జా, రైతుల సర్టిఫికెట్లను పరిశ్రమ గేటు వద్ద పరిశీలించిన అనంతరం, పరిశ్రమలోకి అనుమతించారు.
తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాశ్ మాట్లా డుతూ.. మొదటి రోజు ఒక సర్వే నంబర్ మాత్రమే సర్వే చేశామన్నారు. మరో రెండు రోజులపాటు సర్వే కొనసాగుతుందని తెలిపారు. అనంతరం సర్వే నివేదికలతోపాటు పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. బుధవారం అచ్చంపేట శివారులోని 77, 78, 79, 80, 81, 82వ సర్వే నంబర్లలో సర్వే చేయనున్నట్టు ఆర్డీవో వెల్లడించారు. ఇదిలావుండగా సర్వే, రెవెన్యూ అధికారులు మినహా ఎవరిని పరిశ్రమ ప్రతినిధులు లోపలికి అనుమతించలేదు.
ఈటల రాజేందర్కు చెందిన జమున హ్యాచరీస్ పరిశ్రమ కబ్జా చేసిన ప్రభుత్వ భూములను సర్వే చేసి తిరిగి స్వాధీనం చేసుకొని బాధిత రైతులకు న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కబ్జాలపై అధికారులు సర్వే చేస్తున్నట్టు తెలుసుకున్న సదరు నాయకులు మంగళవారం ర్యాలీగా పరిశ్రమ వద్దకు తరలివచ్చారు. అప్పట్లో ఈటల రాజేందర్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బడుగుల భూములను కబ్జాచేసి పరిశ్రమను ఏర్పాటు చేశారని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. కబ్జాలను వెలికితీసి సదరు భూములను ప్రభుత్వానికి అప్పగించాలని సర్వే నిర్వహిస్తున్న అధికారులను కోరారు.
సర్వే నంబర్ 130లోని నా భూమిని జమున హ్యాచరీస్ పరిశ్రమ వారు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిండ్రు. జనరేటర్ షెడ్తోపాటు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిండ్రు. నా భూమిలోకి పోకుండా దౌర్జన్యంతో గేటు పెట్టిండ్రు. నేను ఎవరికి పట్టా సర్టిఫికెట్ ఇయ్యలేదు. ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోలే. గతంలో మక్క, ఆముదం పంటలేసిన. కబ్జాకు గురైన నా భూమిని ఇప్పించాలి.- కత్తెర యాదగిరి, రైతు అచ్చంపేట