హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : తమిళనాడులో ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ లాన్స్నాయక్ సాయితేజ అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం సాయంత్రం చిత్తూరు జిల్లాలోని ఎగువరేగడలో సైనిక లాంఛనాలతో అంతిమసంస్కారాలు పూర్తిచేశారు. ఉదయం బెంగళూరులోని కమాండ్ దవాఖాన నుంచి సాయితేజ భౌతికకాయాన్ని రోడ్డుమార్గంలో ఎగువరేగడకు తీసుకొచ్చారు. సుమారు 30 కి.మీ. మేర సాగిన ర్యాలీలో యువత, విద్యార్థులు జాతీయ పతాకాలతో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. గ్రామానికి చేరుకొన్న సాయితేజ పార్థివదేహాన్ని చూసి భార్య శ్యామల, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమీప ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి ‘సాయితేజ అమర్ రహే’ అంటూ నినదించారు. వ్యవసాయక్షేత్రంలో సైనికులు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం సాయితేజ అంతిమసంస్కారాలు పూర్తయ్యాయి.