లఖింపూర్ (యూపీ), నవంబర్ 10: వాహనాలతో తొక్కించడమే కాదు.. అన్నదాతలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారని లఖింపూర్ ఖీరీ హింసాత్మక ఘటనలపై మొదటి నుంచి రైతులు, ప్రత్యక్షసాక్షులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజమైంది. గత నెల 3న జరిగిన ఆ దారుణ ఘటనకు సంబంధించిన అసలు నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేంద్రమంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రా తన లైసెన్స్డ్ ఆయుధాలతో కాల్పులకు తెగబడినట్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదిక తాజాగా ధ్రువీకరించింది. ఘటన అనంతరం నలుగురు వ్యక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరీక్షించగా ఈ విషయం బయటపడినట్టు నివేదికలో వెల్లడించింది.
లఖింపూర్ ఘటనకు సంబంధం ఉన్నట్టు భావిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆశిష్ మిశ్రా అలియాస్ మోనూ మిశ్రా నుంచి ఒక రైఫిల్ని, కేంద్ర మాజీ మంత్రి అఖిలేశ్ దాస్ మేనల్లుడు, ఆశిష్ స్నేహితుడు అంకిత్ దాస్ నుంచి పిస్తోల్ను, దాస్ బాడీగార్డ్ లతీఫ్ కాలే నుంచి ఓ రిపీటర్ గన్ను, దాస్ సహాయకుడు సత్యప్రకాశ్ నుంచి ఓ రివాల్వర్ను స్వాధీనం చేసుకొని బాలిస్టిక్ పరీక్ష కోసం అక్టోబర్ 15న ఎఫ్ఎస్ఎల్కు పంపించినట్టు వెల్లడించారు. ‘నాలుగు ఆయుధాల్లో మూడు ఆయుధాలను ఫైరింగ్ కోసం వాడినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఇందులో ఆశిష్మిశ్రా ఆయుధం కూడా ఉన్నది. అయితే, ఈ ఫైరింగ్.. ఘటన రోజు జరిగిందా? లేక మరో రోజున జరిగిందా? అనేది ఇంకా తెలియాల్సి ఉన్నది’ అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సత్యప్రకాశ్కు చెందిన ఆయుధానికి సంబంధించిన రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉన్నదన్నారు. కాగా, కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) అధికారికంగా ఎఫ్ఎస్ఎల్ నివేదికను విడుదల చేయాల్సి ఉన్నది.
లఖింపూర్లో రైతుల నిరసనలను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టు రామన్ కశ్యప్ మరణానికి సంబంధించి ఆయన సోదరుడు పవన్ కశ్యప్ మంగళవారం జిల్లాకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆశిష్మిశ్రా సహా 14 మందిపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అందులో విజ్ఞప్తి చేశారు. వాహనాలతో తొక్కించడం వల్లే తన సోదరుడు మరణించినట్టు సిట్ దర్యాప్తులో తేలిందని, రైతుల దాడిలో తన సోదరుడు మరణించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే విషయంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసినప్పటికీ, వాళ్లు కేసు నమోదు చేయలేదన్నారు. అందుకే కోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు.
లఖింపూర్లో రైతులపై దాడి చేయడానికి ఆశిష్మిశ్రా ముందస్తుగానే కుట్రపన్నాడని బహ్రియాచ్ జిల్లాకు చెందిన జగ్జీత్ సింగ్ అనే వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. అందులోని వివరాల ప్రకారం.. ‘శాంతియుత నిరసన ప్రదర్శన కోసం లఖింపూర్లోని మహారాజ అగ్రసేన్ ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్ గ్రౌండ్కు గతనెల 3న రైతులు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆశిష్మిశ్రా, ఆయనతో పాటు మరో 15-20 మంది సాయుధులు మూడు వాహనాల్లో అతి వేగంగా ఘటనాస్థలికి చేరుకున్నారు. మహీంద్రా థార్ వాహనంలో ఎడమ సీట్లో కూర్చున్న ఆశిష్మిశ్రా రైతులపై కాల్పులకు తెగబడ్డాడు. అన్నదాతల మీదకు వాహనాన్ని పోనిచ్చాడు. కాల్పుల కారణంగానే గుర్విందర్ సింగ్ అనే రైతు మరణించాడు’ అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో ఆశిష్ మిశ్రాతో పాటు 13 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.