న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ను కలువనుంది. ఈ సందర్భంగా లఖింపూర్ ఖేరి హింస ఘటనపై వాస్తవాలను వివరించి, మెమోరాండం సమర్పించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏడుగురు సభ్యులు ప్రతినిధి బృందంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, గులాం నబీ ఆజాద్, లోక్సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా, కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఈ బృందం బుధవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతిని కలువనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇందు కోసం రెండు రోజుల కింద ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ కోరుతూ లేఖ రాశారు. ‘లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కారణమంటూ రైతులు, ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఆశిష్ మిశ్రతోపాటు ఆయన అనుచరులు స్వయంగా వాహనం నడుపుకుంటూ తమపైకి దూసుకొచ్చినట్లు రైతులు చెబుతున్నారు. అయినప్పటికీ నిందితులతోపాటు కేంద్ర మంత్రిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు’ అని రాష్ట్రపతి భవన్కు రాసిన లేఖలో కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో లఖింపుర్ హింసకు సంబంధించిన వాస్తవాలతో కూడిన పూర్తి సమాచారాన్ని రాష్ట్రపతి ముందుంచేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి భవన్ను కోరింది. ఇక ఈ కేసులో భాగంగా కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రను సుదీర్ఘంగా విచారించిన యూపీ పోలీసులు ఆదివారం రాత్రి చేసి కోర్టులో హాజరు పరుచగా.. కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సోమవారం కోర్టు విచారణ కోసం మూడు రోజులు మంత్రి కుమారుడిని పోలీసు కస్టడీకి ఇచ్చింది.