లక్నో : లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడు, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ దరఖాస్తును సీజేఎం కోర్టు బుధవారం తిరస్కరించింది. ఆశిష్ తరఫున న్యాయవాది అవధేష్ సింగ్ కోర్టులో బెయిల్ దరఖాస్తు చేశారు. ఇదే కేసులో మరో నిందితుడు శేఖర్ భారతిని మూడు రోజుల పాటు పోలీస్ ఇచ్చే అవకాశం ఉన్నది.
ఈ నెల 3న లఖింపూర్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో నలుగురు రైతులు, ఓ పాత్రికేయుడు సహా ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన రోజు ఆశిష్ మిశ్రాతో పాటు ఆయన అనుచరులు స్వయంగా వాహనం నడుపుకుంటూ తమపైకి దూసుకొచ్చినట్లు రైతులు ఆరోపించారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు ఆశిష్ మిశ్రాను గత శుక్రవారం విచారణకు పిలిచారు.
శనివారం సైతం 12 గంటల పాటు విచారించిన అనంతరం అరెస్టు చేశారు. దర్యాప్తు సమయంలో పోలీసులకు ఆశిష్ సహకరించడం లేదని, దీంతో అరెస్టు చేసినట్లు డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ మీడియాకు తెలిపారు. మరో నిందితుడు అంకిత్ దాస్కు విచారణ కోసం నోటీసులునిచ్చారు. సంఘటన జరిగిన రోజు అక్కడే ఉండగా.. ఈ కేసులో సిట్ అతని డ్రైవర్ను సైతం విచారించింది. హుస్సైగంజ్లోని అంకిత్ దాస్ ఇంటికి నోటీసును పోలీసులు అతికించారు.