రెండేండ్ల క్రితం మానేరు తీరాన సందర్శకుల భద్రత కోసం ఏర్పాటు చేసిన లేక్ పోలీసింగ్ సత్ఫలితాలు ఇస్తున్నది.. ఇక్కడి పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ బలవన్మరణాలను నిరోధిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఆత్మహత్య చేసుకొనేందుకు వచ్చిన వారిని రక్షించి, కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా ఇండ్లకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 100 మందిని కాపాడిన నేపథ్యంలో ప్రత్యేక కథనం..
రాంనగర్: రెండేండ్ల క్రితం మానేరు తీరాన సందర్శకుల భద్రత కోసం ఏర్పాటు చేసిన లేక్ పోలీసింగ్ సత్ఫలితాలు ఇస్తున్నది.. ఇక్కడి పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ బలవన్మరణాలను నిరోధిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. ఆత్మహత్య చేసుకొనేందుకు వచ్చిన వా రిని చేరదీసి కౌన్సెలింగ్ చేసి సురక్షితంగా ఇండ్లకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 100 మందిని కాపాడిన నేపథ్యంలో ప్రత్యేక కథనం..కరీంనగర్ శివారులోని మానేరు తీరం పర్యాటకంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న డీర్పార్క్, ఉజ్వలపార్కు, మానేరు నది పరిసరాలను వీక్షించేందుకు నగరంతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది సందర్శకులు వస్తుంటారు.
అలాగే రెండేండ్లకు పూర్వం అనేక మంది ఇక్కడి మానేరు డ్యాంలో దూకి ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ పరిస్థితుల్లో పర్యాటకుల భద్రత, బలవన్మరణాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో రెం డేండ్ల క్రితం కరీంనగర్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో లేక్ పోలీస్ ఔట్పోస్టును ఏర్పాటు చేశారు. ఇందులో చురుకైన సిబ్బందిని నియమించారు. వీరు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పర్యాటకులకు రక్షణ కల్పిస్తున్నారు. ఆత్మహత్య చేసుకొనేందుకు వచ్చిన వారిని కాపాడుతున్నారు. వారి కుటుంబీకులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు.
మంగళవారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకునేందుకు రాగా, ఆమెను ఆమె పిల్లల్ని కా పాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టడంలో లేక్ పోలీస్ ముందువరుసలో ఉంటున్నది. ఇప్పటి వరకు 100 మందిని కాపాడామని లేక్ పోలీస్ ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. మున్ముందు మరిన్నీ పకడ్బందీ చర్యలు చేపడతామని చెప్పారు.
సందర్శకుల భద్రతే ప్రధానం
సందర్శకుల భద్రత కోసం రక్షణ చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. నిరంతరం మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. వివిధ సమస్యలతో ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చిన ఎందరో ప్రాణాలు కాపాడినం. భద్రంగా వారి కుటుంబీకులకు అప్పజెప్పుతున్నం. ప్రజల ప్రాణాలు కాపాడడం ఎంతో ఆనందంగా ఉన్నది.