లాహోర్: ఉగ్రవాదులకు నిధుల (Terror financing) కేసులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అనుచరులను పాకిస్థాన్లోని లాహోర్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. నిషేధిత జమాతుద్ దవా (JUD)కు చెందిన ఆరుగురు నేతలను నిర్దోషులుగా తీర్పునిచ్చింది. 2008 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలో జేయూడీ పనిచేస్తున్నది. ఇది లష్కరే తొయిబాకు అనుబంధ సంస్థగా కొనసాగుతున్నది. ముంబై దాడుల్లో 160 మందికిపైగా మరణించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఏప్రిల్లో లాహోర్ యాంటీ టెర్రరిజమ్ కోర్టు జేయూడీకి చెందిన ఐదుగురు అగ్రనేతలకు తొమ్మిదేండ్ల జైలు శిక్ష విధించింది. వారిలో మాలిక్ జాఫర్ ఇక్బాల్, యాహ్యా ముజాహిద్, నసారుల్లాహ్, సమియుల్లాహ్, ఉమర్ బహదూర్ ఉన్నారు. హఫీజ్ సయిద్ బావమర్ధి అయిన హఫీజ్ అబ్దుల్ రహ్మన్ మక్కికి ఆరు నెలల శిక్ష విధించిన విషయం తెలిసిందే.