భోపాల్: చేసిన కష్టానికి డబ్బులు ఇవ్వమని అడిగినందుకు చెయ్యిని నరికేశాడు యజమాని. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ భవన నిర్మాణసంస్థలో కూలీగా పనిచేస్తున్న దళితుడైన అశోక్ సాకెత్ తనకు రావల్సిన కూలి డబ్బులను ఇవ్వమని యజమాని గణేశ్ మిశ్రాను అడిగాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ క్రమంలో మిశ్రా కొందరితో కలిసి అశోక్ చెయ్యిని నరికేశాడు. విషయం తెలుసుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని అశోక్ను దవాఖానకు తరలించారు. డాక్టర్లు బాధితుడికి చికిత్స చేశారు. మిశ్రాతోపాటు అతడి ఇద్దరి సోదరులను పోలీసులు అరెస్టు చేశారు.