జూబ్లీహిల్స్, నవంబర్17: బాస్కెట్బాల్లో యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియం క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. త్వరలో జరుగనున్న 71వ జాతీయ జూనియర్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికయ్యేందుకు కఠోర శిక్షణతో సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా గద్వాల్లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ చాంపియన్షిప్ పోటీల్లో ఐదుగురు క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు. ఈ పోటీల్లో కేవీబీఆర్ నుంచి బాలుర జట్టులో ముగ్గురు, బాలికల జట్టులో ఇద్దరు పాల్గొననున్నారు. హైదరాబాద్ జిల్లా జట్టుకు కేవీబీఆర్ క్రీడాకారుడు గౌతమ్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
ఇటీవల ఇండియా క్యాంప్లో ఆయన శిక్షణ పొందారు. ఈ క్రీడాకారులు కోచ్ సొహైల్ నేతృత్వంలో శిక్షణ పొందుతున్నారు. ఈనెల 20 వరకు జరుగనున్న ఈ పోటీల్లో బాలుర జట్టు నుంచి కెప్టెన్గా గౌతమ్తోపాటు షావన్, ప్రతీక్, బాలికల జట్టు నుంచి అమ్రీన్, కుందన పాల్గొననున్నట్లు కోచ్ తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు 2022 జనవరి 4 నుంచి 11 వరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగనున్న నేషనల్ బాస్కెట్బాల్ జూనియర్ చాంపియన్షిప్ పోటీలో పాల్గొనేందుకు ఎంపిక చేస్తారు.