బాలానగర్, ఏప్రిల్ 22 : ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కూకట్పల్లి జడ్సీ మమత పేర్కొన్నారు. గురువారం బాలానగర్, ఫతేనగర్ డివిజన్ల పరిధిలో జరుగుతున్న ఫుట్పాత్ పనులు, మొక్కల పెంపకం పనులు, ఎన్ఎస్కేకే హైస్కూల్ సమీపంలో ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులను ఎస్ఈ శంకర్తో కలిసి ఆమె పరిశీలించారు. ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులలో జాప్యానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలానగర్ డివిజన్లో చేపట్టిన ఫుట్పాత్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఫుట్పాత్ పనులు పూర్తి చేయడం ద్వారా పాదచారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
ఫుట్పాత్ పనులు పూర్తి చేసిన తర్వాత మూడు వరుసలలో మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. వర్షాకాలం నాటికి ఫుట్పాత్ పనులు పూర్తిచేసి ఫుట్పాత్ వెనకభాగంలో మొక్కల పెంపకం చేపట్టదలచినట్లు తెలిపారు. గౌతంనగర్ ఎన్ఎస్కేకే హైస్కూల్ సమీపంలో జరుగుతున్న ఫుట్ఓవర్ బ్రిడ్జి పనులు జాప్యం కాకుండా శరవేగంగా పూర్తి చేయాలని సూచించారు. బాలానగర్, ఫతేనగర్ డివిజన్లను అనుసంధానం చేస్తూ చేపట్టిన ఫుట్ఓవర్ బ్రిడ్జిని మే నెల 15వ తేదీ వరకు అందుబాటులోకి తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీడీ శ్రీదేవి, డీఈ గోవర్ధన్గౌడ్, ఏఈ రషీద్ పాల్గొన్నారు.