హైదరాబాద్, జనవరి 3(నమస్తే తెలంగాణ): మలికా హండా.. బధిర చెస్ ప్లేయర్. పంజాబ్కు చెందిన మలిక పుట్టుకతోనే చెవిటి, మూగ సమస్యలతో బాధపడుతున్నది. అయితే వైకల్యం తన శరీరానికే కానీ ప్రతిభకు కాదని ఘనంగా చాటిచెప్పింది. కెరీర్లో ఇప్పటి వరకు ప్రపంచ టోర్నీతో పాటు ఆసియా చాంపియన్షిప్లో రెండు స్వర్ణాలు సహా నాలుగు రజతాలతో మెరిసింది. అంతటితో ఆగకుండా జాతీయ బధిర చెస్ చాంపియన్షిప్లో ఏకంగా ఏడుసార్లు పసిడి పతకం కైవసం చేసుకుంది.
ఇలా జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో ఈ 26 ఏండ్ల చెస్ ప్లేయర్ లెక్కకు మిక్కిలి పతకాలు కైవసం చేసుకుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. తన సొంత రాష్ట్రం పంజాబ్ నుంచి ఆమెకు సరైన ప్రోత్సాహం కరువైంది. అద్భుత ప్రదర్శన కనబరిచే మాలికను పంజాబ్ సర్కార్ కనీసం పట్టించుకున్నది లేదు. దీంతో విసిగివేసారిన మలిక..తన ఆక్రోశాన్ని ట్విటర్ వేదికగా వెల్లగక్కింది. బధిర ప్లేయర్ల కోసం ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు తమ పాలసీలో లేవన్న ఆ రాష్ట్ర క్రీడా మంత్రి పర్గత్సింగ్ను లక్ష్యంగా చేసుకుంటూ తన కోపాన్ని వ్యక్తపరిచింది.
అయితే తన దృష్టికి వచ్చిన ఈ ట్వీట్పై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. మలికకు సంబంధించి వివరాలు అందిస్తే వ్యక్తిగతంగా వీలైనంత సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ట్వీట్ చేశారు. మంత్రి కార్యాలయ సిబ్బంది మలిక కుటుంబ సభ్యులను వెంటనే సంప్రదించారు. తమ కూతురుకు మంత్రి కేటీఆర్ సాయం అందించేందుకు ముందుకు రావడంపై కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే సునీతాకృష్ణన్ ట్వీట్కు మంత్రి కేటీఆర్ స్పందిస్తూ దివ్యాంగ చాంపియన్ల కోసం ప్రత్యేకంగా ఒక పాలసీ రూపొందించాలని క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ను కోరుతూ మరో ట్వీట్ చేశారు.