డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యంమత్తులో క్యాబ్ డ్రైవర్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కేపీహెచ్బీకాలనీ ట్రాఫిక్ ఏఎస్ఐ అన్నపురెడ్డి మహిపాల్రెడ్డి బుధవారం మృతిచెందారు. ఈనెల 27న రాత్రి నిజాంపేట రోడ్డులో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అతడు తప్పించుకునేందుకు యత్నించగా హోంగార్డు ప్రహ్లాద్తో పాటు మరోఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వివరాలు సేకరిస్తున్న ఏఎస్ఐ మహిపాల్రెడ్డిని మద్యం మత్తులో ఉన్న క్యాబ్ డ్రైవర్ వేగంగా ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలయ్యారు. సిబ్బంది వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించగా నాలుగురోజులపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. మహిపాల్రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
విధి నిర్వహణలో చక్కటి సేవలందించడంతోపాటు తన అవయవదానంతో పలువురికి ప్రాణం పోసిన గొప్ప వ్యక్తి మహిపాల్రెడ్డి అని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ అన్నారు. తొలుత ఆస్పత్రి వద్ద, ఆ తర్వాత మహిపాల్రెడ్డి స్వగ్రామం బండ్లగూడ మండలం కిస్మత్పూర్లో ఆయన మృతదేహానికి సీపీ నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన అవయవదానానికి కుటుంబసభ్యులు అంగీకరించడం చాలా గొప్ప విషయ మన్నారు. పోలీసుశాఖ ఇప్పటికే అనేకమందికి అవయవదానం చేసిందని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మూడు కుటుంబాల్లో విషాదం నెలకొందన్నారు. వాహనదారులు అర్థం చేసుకొని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రాబోయే రోజుల్లో నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని స్పష్టం చేశారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు మరింత రక్షణ పెంచుతామని హామీఇచ్చారు.
ఏఎస్ఐ మహిపాల్రెడ్డి మృతితో బండ్లగూడ మండలం కిస్మత్పూర్లో విషాదచాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు పెద్దఎత్తున ఇంటి వద్దకు చేరుకొని నివాళులర్పించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సీపీ సజ్జనార్ మహిపాల్రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. ఏఎస్ఐ మహిపాల్రెడ్డి మృతదేహానికి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. మహిపాల్ రెడ్డి అంత్యక్రియల్లో జీవన్దాన్ సంస్థ ఇన్చార్జి స్వర్ణలత, శంషాబాద్ డీసీపీ ప్రకాష్రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ విజయ్కుమార్, ఏసీపీలు సురేందర్రావు, సంజయ్కుమార్, మాణిక్యరాజు, సీఐలు కనకయ్య, శ్యామ్సుందర్రెడ్డి, ఎస్ఐ బాలరాజ్, సిబ్బంది పాల్గొన్నారు.
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా హోంగార్డు, ఏఎస్ఐలను ఢీకొట్టిన కారు డ్రైవర్లు ఎం.రమేశ్(36), గొరిగె పవన్కుమార్(29)లను కేపీహెచ్బీకాలనీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వరంగల్ జిల్లా ఎర్రగట్టుగుంటకు చెందిన రమేశ్ బాచుపల్లిలో ఉంటూ వ్యాపారం చేస్తుండగా, పవన్కుమార్ ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.