‘ఇటు చేయి వేసిన తాత హేలా కవిత్వాభిరాముడటు చేయి వేసిన తాత ఆధ్యాత్మ విద్యానిధానుడిటుల నా తల్లిదండ్రులిర్వురీ చెట్ల మధురఫలములు చిటిలిన మధువేనొకానొ చేకొమ్ము పాంచాలరాయ’
…అని తన ఘన వారసత్వ సంపద గురించి చెప్పుకొన్న విద్వన్మణి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య. ఆయన పితామహులు కోయిల్ కందాడై రంగాచార్యులు విశిష్టాద్వైతంలో మహా విద్వాంసులుగా పేరుపొందారు. మాతామహులు ఠంయ్యాల లక్షీనరసింహాచార్యులు కవినాథ బిరుదాంకితులు. వారిరువురి మధురఫలాల నుంచి ఉద్భవించిన మధువు ఈ సమున్నత మేరుశిఖరంగా రూపుదాల్చింది.
పంచనారసింహ క్షేత్రం వేల్పుగొండ (ఇప్పటి జఫర్గఢ్)లో 1936 మార్చి 17న వెంకట నరసింహాచార్యులు, లక్ష్మీనరసమ్మ దంపతుల తొలి సంతానంగా జన్మించారు సుప్రసన్న. ఆయన పితామహులు కోయిల్ కందాడై రంగాచార్యులు ఉమ్మడి వరంగల్లు జిల్లాలోని తొర్రూరు సమీపంలో ఉన్న చిట్యాల నుంచి వరంగల్లుకు వచ్చి స్థిరపడ్డారు. సుప్రసన్న నాయనమ్మ ‘వరదరాజుల పెళ్లి, ‘సీతాకల్యాణం’ మొదలైన జానపదగీతాలను పాడేవారు. విద్వాంసులెవరైనా ఆ ప్రాంతానికి వస్తే వారి ఇంట్లోనే దిగడం వల్ల ఆ ఇంట్లో శాస్త్రచర్చలు, సాహి త్య సంభాషణలు సాగేవి. తొమ్మిదేండ్ల వయసులోనే కందపద్య రచన ప్రారంభించారు సుప్రసన్న.
నిజాం పరిపాలనాకాలంనాటి రాజకీయ, సామాజిక పరిస్థితుల కారణంగా పలు కుటుంబాలు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లాయి. సుప్రసన్న కుటుంబం కూడా ఆ విధంగా కల్లెడ దొర ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు ఆహ్వానం మేరకు కల్లెడకు చేరుకుంది. అక్కడ సుప్రసన్న తాత రంగాచార్యులు ఉద యం, సాయంత్రం ఆధ్యాత్మిక అంశాలను, శ్రీమద్రామాయణ విశేషాలను చెప్పేవారు. అదేకాలంలో తన చిన్నాన్న సంపత్కుమారాచార్యతో కలిసి కవిత్వ సాధన చేశారు సుప్రసన్నాచార్య. 1948 సెప్టెంబరు 17న హైదరాబాదు సంస్థానంపై పోలీసుచర్య జరిగిన అనంతరం ఆ కుటుంబం తిరిగి పాతూరుకు చేరుకున్నది. సుప్రసన్న 1959లో ఉస్మానియా నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. పట్టా పొందారు. ‘రామరాజ భూషణుని కృతులు’ అనే అంశంపై ఆచార్య బిరుదురాజు రామరాజు పర్యవేక్షణలో జరిపిన పరిశోధనకు 1962లో ఓయూ డాక్టరేటు ప్రకటించింది. 1961లో ఓయూలో అడ్హాక్ లెక్చరర్గా నియమితులయ్యారు. 1962 నుంచి కాకతీయ విశ్వవిద్యాలయం లెక్చరర్గా, రీడర్గా, ప్రొఫెసర్గా పనిచేశారు. వరంగల్ సాయంకాలం కళాశాలకు ప్రధానాచార్యులుగానూ, కేయూ తెలుగు శాఖాధిపతిగానూ, డీన్గానూ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గానూ కీలక బాధ్యతలు నిర్వహించారు.
కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ అంటే సుప్రసన్నకు అత్యంత అభిమానం. అరవిందులు, రమణ మహర్షి, సద్గురు శివానందమూర్తి ప్రభావం ఆయనపై ఉన్నది. అరవిందుడి తత్త్వంపై ‘భారతి’లో ప్రచురితమైన వేలూరి వారి వ్యాసాలు సుప్రసన్న తత్త్వదృష్టికి సైద్ధాంతిక పునాది కల్పించాయి.
1951లో సుప్రసన్న చదివే పాఠశాలకు విశ్వనాథ సత్యనారాయణ సోదరులు వేంకటేశ్వర్లు తెలుగు అధ్యాపకులుగా వచ్చారు. సుప్రసన్న రాసిన పద్యాలను ఆయన పరిశీలించేవారు. సుప్రసన్న, సంపత్కుమార రాసిన పద్యాలను ‘సర్వేశ్వరా!’ అనే మకుటంతో శతకంగా తేవాలని నిర్ణయించారు. విశ్వనాథ వేంకటేశ్వర్లు ఆ పద్యాలను విశ్వనాథ సత్యనారాయణకు చూపించి, పీఠిక రాయించారు. అలా 1954లో సుప్రసన్న, సంపత్కుమారల తొలి గ్రంథం ‘హృద్గీత’గా వెలువడింది. అప్పటి తెలంగాణ రచయితల సంఘం కార్యదర్శి, సుప్రసిద్ధ కవి ఆచార్య సి.నారాయణరెడ్డి ప్రోత్సాహంతో వారి రచనలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యేవి. ‘తెలుగు స్వతంత్ర’లో ప్రచురితమైన సందర్భంలో పేర్ల చివరనున్న ఆచార్య పదం తొలగించడంతో ఇద్దరూ సుప్రసన్న, సంపత్కుమార అయ్యారు.
యాభైకి పైగా గ్రంథాలను సుప్రసన్న రచించారు. ఆ గ్రంథాల్లో కవిత్వం, పద్యం, శతకం, నాటకం, నాటికలు, వ్యాసాలు మొదలైన పలు ప్రక్రియల రచనలు ఉన్నాయి. పలు గ్రంథాలకు సంపాదక బాధ్యతలను నిర్వర్తించారు. భావసంధ్య, సమర్పణ, సమర్చన, దర్పణం, కావ్యప్రమితి, చందనశాఖి, రసరాజధాని మొదలైనవి ఆయన రచించిన వ్యాస సంకలనాలు. వివిధ గ్రంథాలకు రాసిన పీఠికలు ‘అంతరంగం’ సం పుటంలో చూడవచ్చు. ‘పాంచాలరాయ శతకం’ అనే శతకాన్ని ఆయన రచించారు. ‘అగ్నిగర్భ’, ‘వసుచరిత్ర’, ‘చేతనావర్తం-1’, ‘హిరణ్యగర్భ’ తదితర గ్రంథాలకు సంపాదక బాధ్యతలను పోషించారు. విశ్వనాథ వాఙ్మయ సూచికకు, దూపాటి వేంకటరమణాచార్యుల జీవిత చరిత్ర గ్రంథానికి సంపాదకునిగా వ్యవహరించారు. ‘అంగద విజయం’ నాటకాన్ని రచించారు.
రేడియో కోసం రాసిన నాటికలతో ‘శుక్తిమతి’, ‘సౌభద్రుని యాత్ర’, ‘తెలుగు రుతువులు’, ‘అన్నదమ్ములు’ తదితర గ్రంథాలను వెలువరించారు. ఇవేకాకుండా ‘మణికర్ణిక’ తదితర కావ్యాలను కూడా ఆయన రచించారు. చిన్నాన్న కోవెల సంపత్కుమారాచార్యతో కలిసి ‘హృద్గీత’తో పాటు ‘ఆనందలహరి’, ‘అపర్ణ’ మొదలైన గ్రంథాలను వెలువరించారు.
అనుభూతి ప్రధానంగా సుప్రసన్న రాసిన ‘పాండిచ్చేరి గీతాలు’ లౌకికంగా పాండిచ్చేరి యాత్రను సూచిస్తూనే ఆధ్యాత్మిక జీవన యాత్రను కూడా సూచించే డజను గీతాలతో కూడుకున్న గ్రంథం. చేతనావర్త కవుల్లో ఒకరిగా తెలుగు సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానం పొందారు సుప్రసన్న.
ఆచార్య కోవెల సుప్రసన్న పలు గౌరవాలు, పురస్కారాలు పొందారు. ఆయన రచించిన పీఠికల సంకలనం ‘అంతరంగం’ 2010లో కేంద్ర సాహిత్య అకాడమీ నుండి టాగూరు సాహిత్య పురస్కారాన్ని పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2013లో ‘హంస’ పురస్కారాన్ని స్వీకరించారు. 2009లో ఆచార్య గంగప్ప సాహితీ పురస్కారాన్ని, 2001లో జీవీఎస్ సాహిత్య పురస్కారాన్ని ఆయన పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ పరిశోధనకు 1997లో, ఉత్తమ విమర్శకు 2001లో ఆయన పురస్కారాలను స్వీకరించారు. 1987లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందారు. 1955లో తెలంగాణ లిటరసీ ఫోరం ఉత్తమ కవితాపురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసింది. ఆయన రచించిన ‘సాహిత్య వివేచన’ గ్రంథం 1971లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది. ఇవే కాకుండా సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్టు మొదలైన సంస్థలు ఆయనను వివిధ పురస్కారాలతో గౌరవించాయి.
(ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తమ గురువు పోలూరి హనుమ జానకీ రామశర్మ పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ప్రఖ్యాత సాహితీవేత్త ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యకు అక్టోబర్ 13న బహూకరించిన సందర్భంగా వ్యాసం..)
డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు
94410 46839