కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 2: దండకారణ్యంలో ఉంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులు సత్ప్రవర్తనతో అరణ్యం వీడాలని, జనం మధ్యకు వచ్చి జీవించాలని భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు మిలీషియా సభ్యులు, ముగ్గురు గ్రామ కమిటీ సభ్యులు ఎస్పీ, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయిన సందర్భంగా గురువారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మావోయిస్టు పార్టీ తెలంగాణలో పూర్తిగా పట్టు కోల్పోయిందన్నారు. మావోయిస్టుల సిద్ధాంతాలపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ప్రజలకు వారిపై అపనమ్మకం ఏర్పడిందన్నారు. అయినప్పటికీ మావోయిస్టులు రైతులు, కాంట్రాక్టర్లను బెదిరించి ధాన్యం, డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీస్శాఖ పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నదన్నారు. మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ మిలీషియా సభ్యులుగా కొనసాగుతున్న పొడియం రాజీ, సోడి గంగితో పాటు చర్ల మండలం కొండవాయి గ్రామ కమిటీ సభ్యులైన దూది గంగ, పొడియం అదమయ్య, ముస్కి కోసయ్య పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. వీరంతా మావోయిస్టుల వేధింపులకు తాళలేక జన జీవన స్రవంతిలో కలుస్తున్నారన్నారు. ‘కమ్యూనిటీ పోలీసింగ్’తోనే మావోయిస్టులు లొంగిపోతున్నారన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా మావోయిస్టులు, మిలీషియాసభ్యులు, గ్రామ కమిటీ సభ్యులూ పోలీస్ స్టేషన్లలో లొంగిపోవచ్చన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) వుప్పు తిరుపతి, భద్రాచలం ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ సెకండ్ ఇన్ కమాండెంట్ కమల్వీర్ యాదవ్, చర్ల సీఐ బొడ్డు అశోక్కుమార్, ఎస్సైలు రాజువర్మ, వెంకటపయ్య పాల్గొన్నారు.
మావోయిస్టు దంపతుల లొంగుబాటు
కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 2: ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న పామేడు ఏరియా కమిటీ సభ్యులు, దంపతులు పొజ్జా అలియాస్ సంజు మడివి, లక్కీ అలియాస్ తులసి మడివి సత్ప్రవర్తనతో పోలీస్ అధికారుల ముందు లొంగిపోయినట్లు డీఐజీ (ఆపరేషన్స్) వినయ్కుమార్ తెలిపారు. గురువారం దంతెవాడ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వీరికి అనేక విధ్వంసక ఘటనలతో ప్రమేయం ఉందన్నారు. వీరిలో ఒక్కొక్కరిపై రూ.5 లక్షల రివార్డు ఉందన్నారు. సమావేశంలో ఎస్పీ అభిషేక్ పల్లవ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.