కుభీర్, నవంబర్ 16: నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(కె) ఆధ్యాత్మిక గ్రామంగా వెలుగొందుతోంది. గ్రామంలో మార్పు కోసం ఆరేండ్లుగా 80 శాతం మంది మద్యం, మాంసం దరికి రానివ్వడం లేదు. దీనంతటికీ యేటా గ్రామస్తులందరూ కలిసికట్టుగా నిర్వహించే తాళ సప్తమి వేడుకలే ప్రధానంగా చెప్పుకుంటారు. గ్రామంలో ఆధ్యాతికత పెంచేందుకు ఆంజనేయస్వామి ఆలయం పునర్నిర్మాణంతో పాటు, రాజరాజేశ్వర ఆలయం, విఠల రుక్మిణి (నిర్మాణంలో ఉంది) మందిరం, శనీశ్వర ఆలయం, పోచమ్మ, మహాలక్ష్మీ ఆలయాలు నిర్మించుకున్నారు. యేటా ఏడు రోజుల పాటు నిర్వహించే సప్తమి వేడుకల్లో ప్రముఖలను రప్పి దైవ కీర్తనలు వినిపిస్తారు. ఇక ఆ తర్వాత పండరీపురం పాదయాత్ర నిర్వహిస్తారు. వందలాది మంది యాత్రకు వెళ్లి అక్కడే తులసీమాలను స్వీకరిస్తారు. దీంతో ఆరేండ్లుగా ఈ గ్రామంలో మద్యం, మాంసం దుకాణాలు కనిపించడం లేదంటే దీని ప్రత్యేకత అర్థం చేసుకోవచ్చు. గ్రామమంతా ఐక్యంగా ఉందనడానికి ఇక్కడ ప్రశాంతతనే చెప్పుకోవచ్చు. ఏ సమస్య వచ్చినా అందరూ కలిసి చర్చించుకుంటారు. పోలీస్ స్టేషన్కు వెళ్లే వారు ఉండరు. మండలంలో అతి తక్కువ కేసులున్న గ్రామం కూడా ఇదే కావడం గమనార్హం.
పండరీపూర్లో మాల వేసుకున్న..
కొన్నేళ్ల క్రితం నేను పండరీపురం వెళ్లిన. అక్కడ బాబా మహారాజ్ చేతుల మీదుగా తులసీమాల వేసుకున్న. అప్పటి నుండి మద్యం, మాంసాలకు దూరంగా ఉండి దైవ చింతనే అలవాటు చేసుకున్న. ఇప్పుడు పునర్జన్మ పొందినట్లు ఉంది. గొడవలు, కొట్లాటలు లేని మాగ్రామంలో వార్ఖరీ సంప్రదాయ భక్తులు, హరిఓం భక్తులు, స్వాధ్యాయ భక్తులు, ఆంజనేయ స్వామి దీక్ష, అయ్యప్ప ధీక్ష భక్తులు ఉండడానికి సప్తమి వేడుకలే కారణం. గ్రామం ప్రశాంతంగా ఉండడానికి ఆధ్యాత్మికత వైపు మళ్లడమే కారణమని అనుకుంటున్న.
చిన్నన్న, మాలధారి