వందశాతం మరుగుదొడ్లు పూర్తి
ఇంటింటికీ మిషన్భగీరథ శుద్ధ జలం
ప్రతి రోజూ చెత్త సేకరణ, ఎరువుల తయారీ
సీసీ రోడ్లు, డ్రైన్స్ నిర్మాణంతో అద్దంలా వీధులు
పేదలకు 30 డబుల్ బెడ్రూం ఇండ్లు
రైతువేదిక, సెగ్రిగేషన్ షెడ్డు, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు
సర్పంచ్ కృషితో స్వచ్ఛందంగా సీసీ కెమెరాల ఏర్పాటు
కుభీర్,మార్చి 27: సమైక్య రాష్ట్రంలో మాలేగాంలో సమస్యలు తాండవం చేసేవి. కనీస అవసరాలైన హైస్కూల్, అంతర్గత రోడ్లు, గ్రామ పంచాయతీ భవనం, మురుగు కాలువలు కనిపించేవి కావు. స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం రూ.30లక్షలతో (ఉన్నత పాఠశాల)బడి, రూ. 11లక్షలతో ఆరోగ్య ఉప కేంద్రం, రూ.24 లక్షల దేవాదాయ నిధులతో శివాలయం(గుడి), ఒకే సారి రూ.50లక్షలతో సీసీ రోడ్లు, రూ. 13 లక్షలతో ఇటీవల సీసీ డ్రైన్లు, రూ.15 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, ఎల్ఈడీ లైట్ల బిగింపు, రూ.22 లక్షలతో రైతువేదిక భవ నం, రూ.కోటీ 60లక్షలతో 30 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మా ణం, పల్లె ప్రగతిలో వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు, పల్లె ప్రకృతివనం అందుబాటులోకి వచ్చాయి. దీంతో తమ గ్రామానికి మంచి రోజులు వచ్చాయని గ్రామస్తులు సంతోషంగా చెబుతున్నారు. వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం కూడా గ్రామంలో పూర్తి కాగా, ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందుతున్నది.
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు పెద్దవై నీడనిస్తుండడంతో పాటు పల్లె రోడ్లకు ప్రకృతి అందాలను తెచ్చిపెడుతున్నాయి. పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలను జీపీ నిధులతో కొనుగోలు చేశారు. నిత్యం నలుగురు కార్మికులు గ్రామం లో చెత్తను సేకరించి, సెగ్రిగేషన్ షెడ్డుకు తరలిస్తున్నారు. ఇక్కడే ఎరువు తయారీపై దృష్టి సారించారు. గ్రామంలో గూడు లేని పేదల కోసం 30 డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మాణంలో ఉన్నా యి. మాలేగాం నుంచి అంతర్ని, మాలేగావ్ నుంచి పాంగ్రా లింకు రోడ్లు రూపుదిద్దుకున్నాయి. రైతుల కోసం రైతువేదికను నిర్మించారు. పంచాయతీ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న సర్పంచ్ను స్థానిక ప్రజలు మెచ్చుకుంటున్నారు. మాలేగాం అభివృద్ధి పథంలో పయనించడంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి కృషి ఎంతో ఉందని సర్పంచ్ మహిపాల్ తెలిపారు. అంతర్ని-మాలేగావ్ పానాది, పోశవ్వల పానాది వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే దారులను ఈజీఎస్ ద్వారా రోడ్డుగా మార్చుకొని ఎన్నో ఏళ్ల సమస్యను పరిష్కరించుకొని శభాష్ అనిపించుకున్నారు.
ఇద్దరు కలెక్టర్ల ప్రశంసలు..
మాలేగాంను సందర్శించిన జిల్లా అప్పటి కలెక్టర్ ప్రశాంతి, ప్రస్తుత కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ జీపీ కార్యాలయాన్ని, ఏపుగా పెరిగిన మొక్కలు చూసి మెచ్చుకున్నారు. పంచాయతీ కార్యాలయాన్ని, అభివృద్ధిని చూసి గుడ్ జాబ్.. కీపిటప్ అం టూ సర్పంచ్ను ప్రశంసించారు. సొంతగా రూ.1.50 లక్షలతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడంపై పోలీసులు, భైంసా మున్సిఫ్ మేజిస్ట్రేట్ సర్పంచ్పై ప్రశంసలు కురిపించారు.