సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో అపురూప ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఎంతోమంది అద్భుత ప్రతిభ కల్గిన క్రికెటర్లను అందించిన భారత్..కోహీనూర్ వజ్రం లాంటి విరాట్ కోహ్లీని ప్రపంచానికి పరిచయం చేసింది. పసిప్రాయం నుంచే క్రికెట్ను నరనరాన అవపోసన పట్టించుకున్నకోహ్లీ కెరీర్లో కీలక మైలురాయికి చేరువయ్యాడు. సుదీర్ఘ ఫార్మాట్కు సరికొత్త సొగసులు అద్దిన కింగ్ కోహ్లీ చరిత్రాత్మక వందో టెస్టుకు మొహాలీ వేదిక కాబోతున్నది. తన కళాత్మక ఆటతీరుతో ఇప్పటికే క్రికెట్పై చెరుగని ముద్ర వేసిన విరాట్.. దిగ్గజాల సరసన చేరే సందర్భం రానే వచ్చింది. శ్రీలంకతో శుక్రవారం తొలి టెస్టు ద్వారా టెస్టుల్లో వంద మ్యాచ్ల మార్క్కు చేరుకోబోతున్నాడు
మొహాలీ: విరాట్ కోహ్లీ..క్రికెట్ బతికున్నంత కాలం అజరామరం ఈ పేరు. క్రికెట్ కోసమే పుట్టాడా అన్న రీతిలో ప్రపంచ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లీ మరో మైలురాయికి చేరువయ్యాడు. కసి, పట్టుదల, పరాక్రమానికి ప్రతీకగా నిలుస్తూ సహచరుల్లో స్ఫూర్తి నింపడంలో ముందుండే..విరాట్ వందో టెస్టు ఆడబోతున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో మొదటి టెస్టు ద్వారా ఈ అరుదైన ఫీట్ను అందుకోబోతున్నాడు. సరిగ్గా 14 ఏండ్ల క్రితం లంకపై అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన కోహ్లీ..ఇప్పుడు అదే లంకపై 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. ఇది కాకతాళీయమైనా..ఈ సుదీర్ఘ ప్రయాణంలో విరాట్ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వారసునిగా టీమ్ఇండియా చిరస్మరణీయ విజయాల్లో పాలుపంచుకున్నాడు. ‘అభినవ సచిన్’గా మన్ననలు అందుకుంటూ లెక్కలు మిక్కిలి రికార్డులను తన పేరిట లఖించుకున్న కోహ్లీ వందో టెస్టు ద్వారా మరోమారు తన మార్క్ చూపెట్టాలనుకుంటున్నాడు. గత రెండేండ్లుగా ఫార్మాట్తో సంబంధం లేకుండా సెంచరీ మార్క్ అందుకోలేకపోయిన ఈ సీనియర్ బ్యాటర్ మరోమారు తన ట్రేడ్మార్క్తో అలరించాలని చూస్తున్నాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకుని ప్రస్తుతం పూర్తిస్తాయి బ్యాటర్గా జట్టుకు సేవలందిస్తున్న కోహ్లీ..మొహాలీ గడ్డపై తన వందో మ్యాచ్ను చిరస్మరణీయం చేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు స్వదేశంలో లంకపై మూడు మ్యాచ్ల్లో మూడు సెంచరీలతో 610 పరుగులు కొల్లగొట్టాడు. ఇదే రీతిలో మరోసారి కోహ్లీ బ్యాటు ఝలిపిస్తే చూడాలని అభిమానులు ఒళ్లంతా కండ్లు చేసుకుని చూస్తున్నారు. దిగ్గజాలు గవాస్కర్, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్కు సాధ్యం కాని వందో టెస్టులో సెంచరీ ద్వారా కోహ్లీ కొత్త రికార్డు నెలకొల్పాలని చూస్తున్నాడు. అన్నీ అనుకూలిస్తే..లంక బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ కోహ్లీ కదంతొక్కితే మొహాలీలో క్రికెట్ అభిమానులకు పండుగే పండుగ. తనదైన ట్రేడ్మార్క్ షాట్లతో విరాట్ జూలు విదిలిస్తే చూడాలని అభిమానులతో పాటు క్రికెట్ పండితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా భారీ ఇన్నింగ్స్కు బాకీపడ్డ కోహ్లీ..లంకతో తొలి టెస్టు మ్యాచ్కు అస్త్రశస్ర్తాలతో సిద్ధమయ్యాడు. నెట్ సెషన్లో పేసర్లు, స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొన్న ఈ డాషింగ్ బ్యాటర్ మెండైన ఆత్మవిశ్వాసంతో కనిపించాడు.
టెస్టుల్లో జట్టును అత్యుత్తమ స్థానంలో నిలిపిన ఘనత విరాట్ కోహ్లీకే దక్కుతుందని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. వందో టెస్టు ఆడుతున్న కోహ్లీపై హిట్మ్యాన్ ప్రశంసలు కురిపించాడు. ‘ఒక టెస్టు జట్టుగా ప్రస్తుతం ఉత్తమంగా ఉన్నాం. ఈ స్థాయిలో నిలిపిన ఘనత కోహ్లీకే దక్కుతుంది. అరంగేట్రం చేసిన నాటి నుంచి అతడి ప్రయాణం అద్భుతంగా సాగింది. ఇప్పుడు వందో టెస్టుకు చేరుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఈ మ్యాచ్ను కోహ్లీ కోసం ప్రత్యేకంగా మారుస్తాం. ఐదు రోజుల ఆటలో కోహ్లీ ప్రదర్శనను చూడడానికి అభిమానులు స్టేడియానికి రావడం మంచి పరిణామం. టెస్టు జట్టుకు విరాట్ చేసిన కృషి అద్వితీయం. అతడు వదిలేసిన స్థానాన్ని నేను అందుకోవాలి. సరైన ఆటగాళ్లతో సరైన ఆట ఆడించాలి. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో ఒకింత వెనుకంజలో ఉన్నాం. రెండు, మూడేండ్లలో మేం తప్పులు చేశామని నేను అనుకోవట్లేదు’ అని రోహిత్ తెలిపాడు.
వంద టెస్టులు
మొహాలీ: తన కెరీర్లో వంద టెస్టులు ఆడుతానని అసలు ఊహించలేదని భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. శ్రీలంకతో జరుగనున్న టెస్టు సిరీస్లో శుక్రవారం వందో చరిత్రాత్మక మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ ఈ సందర్భంగా బీసీసీఐతో మాట్లాడాడు. ‘వంద టెస్టు మ్యాచ్లు ఆడుతానని నిజంగా ఊహించలేదు. అంతర్జాతీయ క్రికెట్లో వందో టెస్టు ఆడడం గొప్పగా భావిస్తున్నా. ఇది సుదీర్ఘ ప్రయాణం. దేవుడి దయతో ఫిట్నెస్ కోసం నేను తీవ్రంగా కష్టపడ్డా. ఇది నాకు, నా కుటుంబానికి, నా కోచ్కు అరుదైన సందర్భం. ఈ మ్యాచ్ పట్ల నేను చాలా సంతోషంగా.. గర్వంగా ఉన్నా’ అని పేర్కొన్నాడు. 2011లో టెస్టులో అరంగేట్రం చేసిన కోహ్లీ తొలి మ్యాచ్లో 4, 15 పరుగులు చేశాడు. ఆ తర్వాత కొదమసింహాంలా విజృంభించి.. టీమ్ఇండియాను అత్యుత్తమ స్థానంలో నిలిపాడు. అత్యంత విజయవంతమైన సారథిగా కోహ్లీ పేరు గడించాడు. వందో టెస్టుతో భారత దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, వీరేందర్ సెహ్వాగ్, హర్భజన్ సింగ్ సరసన కోహ్లీ చేరనున్నాడు.
మొత్తం టెస్టులు :99
ఇన్నింగ్స్ : 168
పరుగులు :7,962
(ఫోర్లు 896,
సిక్సర్లు 24)
మ్యాచ్లు 44
పరుగులు 3,766
అత్యధికం 254 (నాటౌట్)
అత్యధికంగా ఆస్ట్రేలియాపై కోహ్లీ 7 సెంచరీలు బాదాడు.
అత్యధిక పరుగులు (1,960) ఇంగ్లండ్పై సాధించాడు.
కోహ్లీ సారథ్యంలో టీమ్ఇండియా ఆడిన
68 టెస్టుల్లో 40 విజయాలు సొంతం.
(కెప్టెన్గా మొదటి టెస్టు: 2014లో ఆస్ట్రేలియాతో)
టెస్టు అరంగేట్రం: 20-23 జూన్ 2011లో వెస్టిండీస్ మ్యాచ్తో ప్రవేశం. తొలి మ్యాచ్లో 4, 15 పరుగులకే పరిమితం.
అత్యధిక స్కోర్: 254 నాటౌట్ (2019 దక్షిణాఫ్రికా మ్యాచ్లో)
శతకాలు : 27 (ఆఖరి సెంచరీ 2019లో బంగ్లాదేశ్ మ్యాచ్),
2 టెస్టుల్లో 20 సెంచరీలు బాదిన రెండో కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రీమ్ స్మిత్ 25 సెంచరీలతో ముందు ఉన్నాడు.
టెస్టులు: 99
ఇన్నింగ్స్లు: 168
పరుగులు: 7962
అత్యధిక స్కోరు: 254
సగటు: 50.39
సెంచరీలు: 27
అర్ధసెంచరీలు: 28
భారత్ తరఫున వంద టెస్టులు ఆడిన ప్లేయర్లు
రాహుల్ ద్రవిడ్: 163
వీవీఎస్ లక్ష్మణ్: 134
అనిల్ కుంబ్లే: 132
కపిల్దేవ్: 131
సునీల్ గవాస్కర్: 125
దిలీప్ వెంగ్సర్కార్: 116
సౌరవ్ గంగూలీ: 113
ఇషాంత్శర్మ: 105
హర్భజన్సింగ్: 103
వీరేంద్ర సెహ్వాగ్: 103
టెస్టు మ్యాచ్లు ఆడుతానని ఎప్పుడు అనుకోలేదు. ఇది సుదీర్ఘ ప్రయాణం. ఇక్కడి(100 మ్యాచ్లు)
వరకు చేరుకోవడం మరిచిపోలేని అనుభూతి.
విరాట్ కోహ్లీ