మౌంట్ మాంగనుయి: మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీకి సమయం రానే వచ్చింది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఏడాది ఆలస్యంగా జరుగుతున్న టోర్నీకి శుక్రవారం న్యూజిలాండ్ వేదికగా తెరలేవనుంది. మౌంట్ మాంగనుయి వేదికగా న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య మెగాటోర్నీ తొలి మ్యాచ్ జరుగనుంది. సొంతగడ్డపై సత్తాచాటాలని కివీస్ చూస్తుంటే..ఎలాగైనా పోటీనివ్వాలన్న పట్టుదల విండీస్కు కనిపిస్తున్నది. భారత్పై వన్డే సిరీస్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కివీస్..ప్రపంచకప్లో ఘనమైన బోణీ కొట్టాలని చూస్తున్నది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ఏడోసారి కప్ను ముద్దాడేందుకు తహతహలాడుతున్నది. మరోవైపు కెరీర్ చరమాంకంలో ఉన్న భారత కెప్టెన్ మిథాలీరాజ్ తన చిరకాల కోసం ప్రయత్నిస్తున్నది. గత ప్రపంచకప్ను ఇంగ్లండ్ను చేజార్చుకున్న టీమ్ఇండియా ఈసారి ఎలాగైనా ఒడిసిపట్టుకునేందుకు కసితో కనిపిస్తున్నది. మొత్తంగా నెల రోజుల పాటు వన్డే ప్రపంచకప్ టోర్నీ అభిమానులను అలరించబోతున్నది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్లన్నీ ఉదయం మొదలుకానున్నాయి.