కీవ్, ఫిబ్రవరి 25: సైనిక చర్య అని చెప్పి ఉక్రెయిన్పై దాడులకు తెగబడిన రష్యా మరింతగా రెచ్చిపోయింది. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతానికి పరిమితమైన రష్యా బలగాలు శుక్రవారం రాజధాని కీవ్లోకి ప్రవేశించాయి. జనావాసాల్లో యుద్ధ ట్యాంకులు స్వైర విహారం చేశాయి. సైనికుల పరేడ్, యుద్ధ విమానాల విన్యాసాలతో నగరమంతా రణభూమిని తలపించింది. పలు ప్రాంతాల్లో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొన్న ప్రజలు మెట్రో అండర్గ్రౌండ్ పాస్, సబ్వే, బంకర్లలో తలదాచుకొన్నారు. నగరం బయట ఉన్న వ్యూహాత్మకమైన ఎయిర్పోర్ట్ను తమ అధీనంలోకి తీసుకున్నట్టు రష్యా ప్రకటించింది. రష్యా దురాక్రమణను అడ్డుకోవడానికి ఉక్రెయిన్ దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రధాన నగరాల్లోకి శత్రువులు ప్రవేశించకుండా వంతెనలను పేల్చేస్తున్నాయి. యుద్ధంలో వెయ్యి మందికి పైగా రష్యా సైనికులు మరణించినట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా దాడుల్లో తమ దేశానికి చెందిన 137 మంది పౌరులు, సైనికులు ఇప్పటివరకు మరణించినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. సైనిక స్థావరాలపై దాడులు చేస్తామన్న రష్యా, ప్రశాంతమైన జనావాసాలపై విరుచుకుపడి పౌరులను పొట్టనబెట్టుకొంటున్నదని, ఈ తప్పుకు ఆ దేశాన్ని ఎన్నటికీ క్షమించలేమన్నారు. ఖార్కివ్ తదితర పట్టణాల్లోకీ రష్యా సేనలు ప్రవేశించినట్టు సమాచారం. ఉక్రెయిన్ భూతలంపై 118 మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది.
రష్యా మొదటి గురి తానేనని జెలెన్స్కీ అన్నారు. తర్వాతి లక్ష్యం తన కుటుంబమని ఆందోళన వ్యక్తం చేశారు. తాను దేశం విడిచి వెళ్లినట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. రష్యా దాడుల నేపథ్యంలో పశ్చిమ దేశాలు, నాటో దళాలు స్పందించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యాతో పోరులో తమ దేశం ఒంటరిగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల సాయం చేయలేదన్నారు. తమ దేశంపై జరుగుతున్న దాడిని యావత్తు ప్రపంచం ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తున్నదని పేర్కొన్నారు. శక్తిమంతమైన దేశం (అమెరికాను ఉదహరిస్తూ) కూడా కేవలం దూరం నుంచి చూస్తూ ఉండిపోయిందన్నారు.
ఉక్రెయిన్పై రెండో రోజూ దాడులు కొనసాగుతున్న సమయంలో రష్యా అధ్యక్ష కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ అధికారుల బృందంతో చర్చలకు సిద్ధమేనని వెల్లడించింది. చర్చలకు బెలారస్ రాజధాని మిన్స్క్కు రష్యా బృందాన్ని పంపిస్తామని పేర్కొంది. అయితే, నాటో కూటమిలో చేరబోమని, ఈ విషయంలో తటస్థంగా ఉంటామని ఉక్రెయిన్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేసింది. చర్చల అంశంపై రష్యా చేసిన ప్రకటనపై ఉక్రెయిన్ స్పందించింది. నాటో కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండే విషయంలో రష్యాతో చర్చలకు సిద్ధమేనని ప్రకటించింది. అంతకుముందు, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్తో చర్చలు జరుపాలని కోరారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్ష కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడితేనే తాము చర్చలకు వస్తామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ విషయంలో ఐరాసలో తమకు భారత్ అండగా నిలుస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ పుతిన్తో మాట్లాడారు. యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, యూరప్లో ఉన్న పుతిన్, రష్యా విదేశాంగమంత్రి లావ్రోవ్ ఆస్తుల్ని స్తంభింపజేసేందుకు ఐరోపా సమాఖ్య అంగీకరించింది.