బెంగుళూరు: కర్నాటకలోని మైసూరుకు చెందిన కిక్ బాక్సర్ నిఖిల్ మృతిచెందాడు. జూలై 10వ తేదీన బెంగుళూరులో జరిగిన కిక్ బాక్సింగ్ ఈవెంట్లో పాల్గొని గాయపడ్డాడు. అయితే ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను ప్రాణాలు విడిచాడు. జ్ఞానభారతి పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. రాష్ట్రస్థాయి కే1 కిక్బాక్సింగ్ చాంపియన్షిప్ను ఈ నెల 10వ తేదీన నిర్వహించారు. కెంగేరికి చెందిన కే1 కిక్ బాక్సర్ సంస్థ ఈ పోటీలను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్లో పోటీపడ్డ నిఖిల్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రత్యర్థి పంచ్లకు నిఖిల్ సొమ్మసిల్లిపోయాడు. బాక్సింగ్ రింగ్లోనే కుప్పకూలాడు. అయితే అతన్ని తక్షణమే హాస్పిటల్కు తరలించారు. రెండు రోజుల పాటు కోమాలో ఉన్న ఆ బాక్సర్ జూలై 12న ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనలో నవీన్ రవిశంకర్తో పాటు కిక్ బాక్సింగ్ అసోసియేషన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.