సింగరేణి సంస్థలో ఒక వ్యక్తే నాలుగు పదవులు నిర్వహిస్తూ అలసిపోకుండా పనిచేస్తున్నారు. తోటి అధికారులు, సిబ్బందితో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ఫైల్స్ పెండింగ్ లేకుండా పనులు ముగిస్తున్న అధికారి ఆయన. ఆటోడ్రైవర్ నుంచి ఐఆర్ఎస్ ఉన్నత చదువు చదివి మూడు డైరెక్టర్ పదవులు నిర్వహిస్తూ సింగరేణి సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న డైరెక్టర్(పా) బలరాం గురించి ప్రత్యేక కథనం.
కొత్తగూడెం సింగరేణి, జనవరి 18 : డైరెక్టర్(ఫైనాన్స్)గా సింగరేణిలో పదవీ బాధ్యతలు చేపట్టిన బలరాం చిన్ననాటి నుంచే కష్టాలను అనుభవించి పట్టుదలతో ఐఆర్ఎస్ చదివారు. పాలమూరు జిల్లా తిరుమలగిరికి చెందిన హున్యా, కేస్లీ దంపతుల ఏడుగురు సంతానంలో పెద్దవాడు. చిన్నతనం నుంచే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ కూలి పనికి వెళ్లేవారు. భవన నిర్మాణ కార్మికుడిగా, హమాలీగా, రైతుకూలీగా పనిచేస్తూ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడ్డారు. కూలీపని చేస్తూనే పదో తరగతి పూర్తి చేశారు. తర్వాత పాలమూరు నుంచి హైదరాబాద్కు మకాం మార్చారు. ఇంటర్మీడియట్లోనే ఆయనకు వివాహం కావడంతో ఉన్నత చదువులకు ఆటంకం ఏర్పడింది. అయినా పట్టుదలతో గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ బాయ్గా పనిచేశారు. షేరింగ్ ఆటోను సైతం నడిపి కుటుంబ భారాన్ని మోస్తూనే చదువుపై ఆసక్తితో అకుంఠిత దీక్షతో 2010లో సివిల్స్లో రెవెన్యూ సర్వీసెస్కు ఎంపికయ్యారు. ముంబాయిలోని ఇన్కం ట్యాక్స్ విభాగంలో డిప్యూటీ కమిషనర్గా మొదటి పోస్టింగ్లో జాయిన్ అయ్యారు.
అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో డిప్యూటేషన్పై సింగరేణిలో డైరెక్టర్ (ఫైనాన్స్)గా 2018 డిసెంబర్ 15వ తేదీన బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి కంపెనీ అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి 2020 జూలై 30న డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్)గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన నిత్యం కొత్త గనులు ప్రారంభించేందుకు అనుమతుల కోసం అధికారులను కలిసేందుకు ప్రయాణాలు చేస్తూ అనుమతులు పొందుతూ వీలైనన్ని ఎక్కువ కొత్త గనులు ప్రారంభించారు. సంస్థ అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు పట్టుదలతో పని చేస్తున్నారు. 2021 ఫిబ్రవరి 16న చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్(సీవీవో)గా అదనపు బాధ్యతలను స్వీకరించి నిర్విరామంగా పని చేస్తున్న ఆయన పట్టుదలను గుర్తించిన సింగరేణి యాజమాన్యం 2021 మే 2వ తేదీన డైరెక్టర్(పా) బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. దీంతో మూడు డైరెక్టర్ పదవులు, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బాధ్యతలను నిర్వర్తిస్తూ అధికారులు, తోటి డైరెక్టర్లు, సిబ్బందితో సమన్వయంతో పనిచేస్తూనే కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఇటు కార్మికులు, అటు అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. పెండింగ్ ఫైల్స్ లేకుండా రాత్రి అయినా ఆఫీస్లోనే ఫైల్స్ను పరిశీలించి క్లియర్ చేస్తుంటారు. ఇంటికి వెళ్లగానే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు, అవకాశం దొరికినప్పుడు మొక్కల సంరక్షణకు పాటుపడుతున్నారు.