ఖమ్మం ఎడ్యుకేషన్, నవంబర్ 28: రాష్ట్రంలో అమలవుతున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని విజయవంతం చేసి దాని ద్వారా విద్యార్థుల్లో కనీస భాషా, గణిత సామర్థ్యాల పెంపుకోసం పర్యవేక్షక అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పరిశీలకుడు, విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ ఎస్.శ్రీనివాసాచారి సూచించారు. ఖమ్మం నగరంలోని డైట్ కళాశాలలో జరుగుతున్న ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పర్యవేక్షణాధికారుల శిక్షణ కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడారు. తొలిమెట్టు అమలుతో ఇప్పటికే రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో గణనీయమైన మార్పు వచ్చిందని, విద్యార్థుల సామర్థ్యాల పెంపుకోసం ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు. దీని అమలులో ఉన్న సమస్యలను అధిగమించడానికి ఈ శిక్షణ కార్యక్రమం వేదిక కాబోతోందని అన్నారు. సందేహాలన్నీ ఇక్కడ నివృత్తి చేసుకొని తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలంలోని ప్రతి పాఠశాలనూ సందర్శించి ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలు ఇచ్చి బోధనను మెరుగుపరచడం ద్వారా తొలిమెట్టు కార్యక్రమ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చని అన్నారు. డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల క్వాలిటీ కోఆర్డినేటర్లు రవికుమార్, నాగరాజశేఖర్, రాష్ట్ర ఎస్సీఈఆర్టీ రిసోర్స్పర్సన్లు సురేందర్, ఉపేందర్, ఉదయ్, కుమారస్వామి పాల్గొన్నారు.