Khairatabad Ganesh | ఖైరతాబాద్ మహాగణపతి ప్రతిష్టాపనకు అంకురార్పణ జరిగింది. నిర్జల్ ఏకాదశిని పురస్కరించుకొని స్థానిక బడా గణేశ్ మండపం వేదికగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం అంకురార్పణ కార్యక్రమం జరిగింది. ఆరు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా భక్తులకు కొంగు బంగారంగా నిలిచిన ఖైరతాబాద్ గణపతిని ఈ ఏడాది 69వ సంవత్సరం 61 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠిస్తున్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి.విజయా రెడ్డి, హైదరాబాద్ జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్పర్సన్ కె.ప్రసన్నతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ఖైరతాబాద్ గణపతి ప్రపంచంలోనే ప్రసిద్దిగాంచిందని, ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తుంటారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని పండుగలకు తగిన ప్రాధాన్యతనిస్తున్నదని, ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రోత్సవాలకు సైతం ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు, అడిషనల్ డీసీపీ రమణా రెడ్డి, ఏసీపీ సంజీవ్ కుమార్, సైఫాబాద్, ఖైరతాబాద్, నాంపల్లి సీఐలు సత్తయ్య, నిరంజన్ రెడ్డి, రాజునాయక్, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ కార్యదర్శి డాక్టర్ భగవంత్ రావు, ఉపాధ్యక్షులు కరోడిమల్, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మహేశ్ యాదవ్, మహేందర్ బాబు, రాంరెడ్డి, కృష్ణాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
దివంగత చైర్మన్ సుదర్శన్ ఆశయాలకు అనుగుణంగానే ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ చైర్మన్ దివంగత సింగరి సుదర్శన్ ఆశయాలకు అనుగుణంగానే ఈ ఏడాది గణపతిని ప్రతిష్ఠిస్తున్నామని కన్వీనర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సందీప్ రాజ్, సింగరి రాజ్ కుమార్ తెలిపారు. గత ఏడాది సుదర్శన్ ఇక్కడ మట్టి గణపతిని ఏర్పాటు చేయాలని సంకల్పించారని, అదే స్ఫూర్తిని ప్రతి ఏడాది కొనసాగిస్తామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు.