హైదరాబాద్, ఆగస్టు14 (నమస్తే తెలంగాణ): గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ఈ నెల 18వ తేదీన నిర్వహించ తలపెట్టిన 18వ బోర్డు సమావేశం వాయిదాపడింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు బోర్డు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించడంతోపాటు, అందుకు సంబంధించి ఎజెండా అంశాలను పంపాలని ఇరు రాష్ర్టాలకు ఇప్పటికే జీఆర్ఎంబీ పంపింది. అందులో ప్రధానంగా గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు లేనేలేవని, రాష్ట్ర ఏర్పాటు తరువాత కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల, చౌటుపల్లి హనుమంత్రెడ్డి తదితర ప్రాజెక్టులకు మంజూరుచేసిన అనుమతులన్నింటినీ పునఃసమీక్షించాలని ఏపీ సర్కార్ ప్రతిపాదనలు పంపింది.
ఆయా అంశాలను ఎజెండాలో బోర్డు చేర్చిన విషయం తెలిసిందే. బోర్డు సైతం ఏపీ వాదనలకు అనుగుణంగానే నీటిలభ్యతపై అధ్యయనం చేసేందుకు టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బోర్డు రూపొందించిన ఎజెండా అంశాలపై, ఏపీ ప్రతిపాదనలపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎజెండా నుంచి ఏపీ ప్రతిపాదిత అంశాలను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సైతం ఎజెండాలో ఏపీ అంశాలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ, ఆయా అంశాలను తొలగించాలని కోరుతూ బోర్డుకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ లేవనెత్తిన అంశాలపై అభిప్రాయం తెలుపాలని ఏపీకి బోర్డు లేఖ రాసింది. ప్రస్తతం ఏపీ నుంచి ఇప్పటికీ బోర్డుకు సమాధానం అందలేదు. 18న కేంద్ర జల్శక్తి శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ రెండింటి నేపథ్యంలో 18వ తేదీ బోర్డు సమావేశాన్ని వాయిదా వేయాలని జీఆర్ఎంబీ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు తాజాగా సమాచారం ఇచ్చినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి.