హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన రూ.3.98 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) కాజేసేందుకు జరిగిన కుట్ర కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. ఈ పత్రాలను తయారు చేసింది తమిళనాడుకు చెందిన పద్మనాభన్ అని, సంతకాలను ఫోర్జరీ చేసింది మహారాష్ట్రకు చెందిన మదన్ పగార్గా గుర్తించారు. వీరిద్దరినీ అరెస్టు చేసిన రిమాండ్కు తరలించిన అధికారులు, తదుపరి విచారణ కోసం కస్టడీకి కోరటంతో సోమవారం నుంచి రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. తెలుగు అకాడమీ కుంభకోణంలో సూత్రధారిగా ఉన్న చుండూరి వెంకట సాయికుమార్ గిడ్డంగుల స్కామ్కు ప్లాన్ చేశాడు. అతడి ప్రధాన అనుచరుడైన వెంకటరమణ గిడ్డంగుల సంస్థకు కార్వాన్లో ఉన్న యూనియన్ బ్యాంకుకు మధ్య దళారీగా వ్యవహరించాడు. ఆ సంస్థ నుంచి రూ.3.98 కోట్ల చెక్కులు తీసుకెళ్లి బ్యాంకు మేనేజర్ మస్తాన్ వలీకి ఇచ్చాడు. అతడిచ్చిన అసలు బాండ్లను తీసుకెళ్లి రమణకు అందించాడు. వీటి ఆధారంగా తమిళనాడుకు చెందిన పద్మనాభన్తో సాయి నకిలీవి తయారు చేయించాడు. అసలు పత్రాలను ఫొటోషాప్ సాంకేతికతతో మార్చి అలాగే ఉన్న నకిలీవి రూపొందించాడు. ఈ నకిలీ ఎఫ్డీలతోపాటు అకాడమీ పేరుతో తయారైన నకిలీ కవరింగ్ లేఖలపై అధికారుల సంతకాలను మదన్ ఫోర్జరీ చేసేవాడని సీసీఎస్ దర్యాప్తు అధికారి కే మనోజ్ కుమార్ తెలిపారు.