పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో మలపుజా వద్ద ఉన్న కురుంబాచి కొండ చీలికలో చిక్కుకున్న యువకుడిని రక్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. అయితే ఇవాళ ఉదయం ఆ కుర్రాడికి ఆహారం, నీటిని ఆర్మీ అందించింది. దాదాపు 43 గంటలుగా ఆర్.బాబు అనే యువకుడు ఆ కొండ చీలికలోనే ఉన్నాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన బాబు.. ఆ కొండను దిగే సమయంలో అలసిపోయి కాలుజారి పడ్డాడు. అయితే కిందపడే క్రమంలో అతను ఆ కొండల్లో ఉన్న చీలిక ప్రదేశంలో చిక్కుకున్నాడు. అతని మిత్రులు కాపాడే ప్రయత్నం చేసినా.. బాబును వాళ్లు రక్షించలేకపోయారు. అయితే కిందకు దిగిన మిత్రులు ఈ విషయాన్ని స్థానిక గ్రామస్థులకు తెలిపారు. ఆ తర్వాత కోస్టు గార్డ్ రంగంలోకి దిగింది. అయినా వాళ్ల హెలికాప్టర్తో బాబును చీలిక నుంచి తీయలేకపోయారు. దీంతో కేరళ సీఎం విజయన్ ఆర్మీ సహాయం కోరారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బాబుకు ఇవాళ ఉదయం రెస్క్యూ బృందం ఆహారం అందించింది. తర్వలోనే బాబును ఆ కొండ మీద నుంచి దింపనున్నారు. ఆర్మీ బృందం బాబుతో మాట్లాడింది. అతను కూడా రిప్లై ఇచ్చాడు. క్షేమంగా ఉన్నట్లు ఆర్మీ వెల్లడించింది.