న్యూఢిల్లీ : ప్రముఖ పర్యావరణవేత్త సుందర్లాల్ బహుగుణకు దేశంలోని అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాయనున్నట్లు గురువారం తెలిపారు. చిప్కో ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించిన బహుగుణ గత మే 21న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ శాసన సభలో జరిగిన కార్యక్రమంలో బహుగుణకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మొక్కను నాటి, బహుగుణ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బహుగుణను చూసి దేశమే కాదు, మొత్తం ప్రపంచమే గర్వపడుతుందన్నారు. ఆయన జీవితంలోని ప్రతి క్షణం ప్రజలకు స్ఫూర్తినిస్తుందన్నారు. ఆయన పర్యావరణానికి చేసిన సేవలకు అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను ఇవ్వాలన్నారు.