KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్కు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం సందర్భంగా కృష్ణా, గోదావరి జలాల విషయంలో, తెలంగాణ రాష్ట్రానికి, పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చించనున్నారు.
దానితోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి, కృష్ణా జలాలను కొల్లగొడుతున్నా కూడా దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని భావించడం జరుగుతున్నది. ఇందులో భాగంగా తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చ జరగనున్నది. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలు అని కేంద్రం ముందు దేబరించడం బాధాకరం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమే.
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ ప్రజలు, రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదు. ఇంకా చెప్పాలంటే బీజేపీ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదనేది స్పష్టమవుతున్నది. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కానీ, కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జల దోపిడికి సహకరిస్తున్న కేంద్ర బీజేపీ విధానాన్ని గాని ఎదుర్కోవాలంటే.. తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వమే గనక తిరిగి వచ్చి ఉంటే ఈపాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవి.. పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల, రైతాంగ ప్రయోజనాలు కాపాడబడేవి. కానీ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, పాలమూరు – రంగారెడ్డి నల్గొండ ప్రజల ప్రయోజనాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం వల్ల పూచిక పుల్లంత పని కూడా చేయలేకపోవడం వల్ల ఆ ప్రాంతం ప్రజలు రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. రెండేళ్లు గడిచినా కూడా, తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంకా తెలంగాణ సమాజం మౌనం వహించ జాలదు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు, కృష్ణా జలాల్లో కేవలం 45 టీఎంసీలు ఒప్పుకోవడం అనేది ఘోరాతిఘోరం, దుర్మార్గం. కాబట్టి సాగునీరు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ రాజీ పడబోదు. ఇటువంటి కీలక సమయంలో పైన తెలిపిన విషయాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలను.. ఈనెల 19వ తేదీన నిర్వహించబోయే సంయుక్త సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కూలంకషంగా చర్చ జరగనున్నది. అందుకు అనుగుణంగా చేపట్టబోయే ప్రజా ఉద్యమాల నిర్మాణం, అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ., పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు., గోదావరి కృష్ణా జలాల విషయంలో, ఆంధ్ర జలదోపిడి పైన పోరాడేందుకు.. ఒక ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశంలో శ్రీకారం చుట్టడం జరుగుతుంది.