KCR Birthday | హరితహారంతో తెలంగాణ తల్లికి ఆకుపచ్చని చీర చుట్టిన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి, రైతుబంధు కేసీఆర్ అని.. ఆయన జన్మదినం సందర్భంగా ఈ నెల 17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. హరిత తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ సంకల్పానికి మద్దతుగా చంద్రునికో నూలుపోగు లాగా వృక్షార్చన కార్యక్రమాన్ని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను కేటీఆర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ ఆఫీస్ సెక్రటరీ, మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, బీగాల గణేశ్, శంకర్ నాయక్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవడమే కేసీఆర్కు మనం ఇచ్చే పుట్టిన రోజు కానుక అన్నారు. వృక్షార్చన కార్యక్రమం తీసుకున్న పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ను కేటీఆర్ అభినందించారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న ఈ వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సంతోష్ కుమార్ కోరారు. హరితసేనలోని సభ్యులందరూ మొక్కలు నాటి అందరినీ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరారు.