హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ఈ నెల 17న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జన్మదినాన్ని పురస్కరించుకొని, బర్త్డే వేడుకలను మూడ్రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. 60 ఏండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసి, స్వరాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలిపిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను అంబురాన్ని అంటేలా నిర్వహిద్దామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, ప్రజలు ఎవరికి తోచిన పద్ధతిలో వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని కోరారు. ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఇందులో భాగంగా దవాఖానలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లో పండ్లు, ఆహారం, దుస్తులు వంటివి పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించాలని చెప్పారు. 17 రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొకలు నాటడం తదితర కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇవేకాకుండా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఇతరులకు సహాయపడే విధంగా ఎలాంటి సేవా కార్యక్రమమైనా చేపట్టవచ్చని కేటీఆర్ సూచించారు.