కార్తీక మాసం సందర్భంగా శైవ క్షేత్రమైన శ్రీశైలంలో కార్తీకదీపోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మనదేశంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ ఒకేచోట వెలసిన ఏకైక శైవ క్షేత్రం శ్రీశైలం. అందుకనే ఈ దేవాలయంలో ప్రతిఏడాది కార్తీకదీపోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది. పరమశివుడికి ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం. కాబట్టి ఈ నెలలో పుష్కరిణిలో స్నానం చేసి శివుడిని దర్శించుకుంటారు. బిల్వ పత్రాల (మారేడు ఆకులు)తో శివుడికి అర్చన చేసి, దీపాలు వెలిగిస్తే అన్ని శుభాలే జరుతాయని భక్తుల నమ్మకం. అంతేకాదు కృష్ణా నదిని తల్లిగా భావించి దీపదానం చేయడమే కాకుండా పసుపు కుంకుమ, చీర, సారెలు సమర్పిస్తారు. ప్రతి సోమవారం, పౌర్ణమి రోజున కోనేరు దగ్గర లక్ష కార్తీకదీపాల్ని వెలిగిస్తారు. ఈ మాసంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివెళ్తారు. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకుంటారు.