Medical Student : కర్ణాటకలోని మల్లాడిహల్లిలో దారుణం జరిగింది. తనకు పాఠాలు చెప్పే ప్రొఫెసర్తో సంబంధం ఉందని తోటి విద్యార్థులు అవమానించడంతో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక, మల్లాడిహల్లిలోని రాఘవేంద్ర ఆయుర్వేద కళాశాలలో నిఖిత (22) అనే విద్యార్థిని బీఏఎంఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అదే కళాశాలలో పనిచేస్తున్న డా.రాజు అనే ప్రొఫెసర్తో నిఖితకు మంచి సన్నిహిత సంబంధం ఉండేది.
అయితే, దీన్ని తప్పుగా అర్థం చేసుకున్న ఆమె క్లాస్మేట్స్ ఇద్దరి మధ్యా ఎఫైర్ ఉందని భావించారు. దీనిపై కళాశాలలో చాలా ప్రచారం జరిగింది. అలాగే, తోటి విద్యార్థులు కూడా ఈ అంశంపై వేధించే వారు. ఇద్దరి మధ్యా సంబంధంపై రకరకాలుగా మాట్లాడేవారు. చివరకు వారి వేధింపులు భరించలేక నిఖిత తన స్వగ్రామంలోని ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఒక సూసైడ్ లేఖ కూడా రాసింది. ఈ ఘటనపై యువతి తండ్రి ఉమా శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి విద్యార్థుల వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వారు నిఖితను మానసికంగా వేధిస్తూ, అవమానాలకు గురి చేశారని కంప్లైంట్ చేశారు. తరచూ వేధించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తనను ఇతరులు వేధిస్తున్న అంశంపై ఆమె తల్లిదండ్రులకు కూడా చెప్పింది. వారు ఏదో కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేవారు. అలాగే, చదువుపై దృష్టి పెట్టాలని కోరేవారు. చివరకు ఒత్తిడి భరించలేక నిఖిత ఆత్మహత్యకు పాల్పడింది.