బెంగళూరు, ఫిబ్రవరి 10: హిజాబ్ అంశంపై తీర్పు వెలువడేంత వరకు రాష్ట్రంలో విద్యార్థులెవరూ మతపరమైన దుస్తులు ధరించి బడులకు హాజరు కావద్దని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ఈ మేరకు సీజే రుతురాజ్ అవస్థీ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. బడులను తెరవాలని, తరగతులను నడపాలని ప్రభుత్వానికి సూచించింది. హిజాబ్ అంశంపై విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉందని ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బడుల్లో హిజాబ్ నిషేధంపై ఆరుగురు విద్యార్థులు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాగా, ‘తీర్పు వెలువడేంత వరకు మతపరమైన దుస్తులు ధరించవద్దంటే.. ఆర్టికల్ 25 ప్రకారం రాజ్యాంగం కల్పించిన మతపరమైన హక్కును నా క్లయింట్లు కోల్పోతారు’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాది దేవదత్ కామత్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ‘తీర్పు వచ్చే వరకే ఇది అమల్లో ఉంటుంది’ అని సీజే అవస్థీ సమాధానం ఇచ్చారు.
హిజాబ్పై జోక్యం చేసుకోండి.. సుప్రీంకోర్టులో పిటిషన్
హిజాబ్ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ అంశంపై జోక్యం చేసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టులో దాఖలైన పిటిషన్లను కూడా సుప్రీంకోర్టుకే బదిలీ చేయాలని పిటిషన్దారు కోరారు. పిటిషన్ను చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం పరిశీలించింది. ఈ వివాదంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతున్నందున కోర్టు నిర్ణయాన్ని బట్టి లిస్టింగ్ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. కాగా, కర్ణాటకలో సోమవారం నుంచి 10వ తరగతి వరకు స్కూళ్లు తెరుస్తామని ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. 11, 12, డిగ్రీ కాలేజీలు తెరవడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ముస్కాన్ ధైర్యం గొప్పది: ఒవైసీ
కర్ణాటకలో కాషాయ కండువాలు కప్పుకొని తన వైపు దూసుకొచ్చిన వందల మందిని ధైర్యంగా ప్రశ్నించిన ముస్కాన్ను మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మెచ్చుకొన్నారు. గురువారం ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఆమె ప్రదర్శించిన ధైర్య సాహసాలు అందరికీ ఆదర్శం అన్నారు. ఆరెస్సెస్ ముస్లిం విభాగం(ముస్లిం రాష్ట్రీయ మంచ్) ముస్కాన్కు మద్దతిచ్చింది.