తుమకూరు: కర్నాటకకు చెందిన ఓ కౌన్సిలర్ తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారాన్ని పొందుపరిచిన కేసులో స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. జేడీఎస్ కౌన్సిలర్ రవి శంకర్ ఎన్నిక చెల్లదని మెజిస్ట్రేట్ పేర్కొన్నది. రవిశంకర్కు బీపీఎల్ కార్డు ఉన్నా.. అతను తన అఫిడవిట్లో 500 కేజీల ఆభరణాల గురించి వెల్లడించలేదని మెజిస్ట్రేట్ తెలిపింది. సీనియర్ సివిల్ జడ్జి గీతాంజలి ఈ కేసును విచారించారు. సిరా మున్సిపల్ కౌన్సిల్ 9వ వార్డు కౌన్సిలర్ రవిశంకర్ తన పూర్తి సమాచారాన్ని దాచాడని, ఆ కేసులో అతను దోషిగా తేలినట్లు కోర్టు చెప్పింది.
ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణప్ప..2021 డిసెంబర్లో కోర్టు కేసు నమోదు చేశారు. క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని అఫిడవిట్లో రవిశంకర్ పేర్కొనలేదని ఆరోపణలు చేశాడు. కౌన్సిలర్ రవిశంకర్ వద్ద 500 కిలోల ఆభరణాలు ఉన్నాయని, 3.6 లక్షల కిరాయి వస్తుందన్న విషయాన్ని కూడా అఫిడవిట్లో చెప్పలేదని అతనిపై కేసు బుక్ చేశారు. రవిశంకర్ వద్ద బీపీఎల్ కార్డు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే పాత క్రిమినల్ కేసుల గురించి అఫిడవిట్ లో ప్రస్తావించలేదని రవిశంకర్ కోర్టుకు తెలిపారు. తన వద్ద 499.5 కేజీల వెండి, 500 గ్రాముల బంగారం ఉన్నట్లు కోర్టుకు వెల్లడించారు.